
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
ములకలపల్లి: ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం ద్వారా అన్నదాతలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించిన సలహాలు, సూచనలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు సూచించారు. మండల పరిధిలోని జగన్నాథపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు 45 రోజులపాటు క్లస్టర్ పరిధిలోని 66 గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, ఆయిల్పామ్ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాంకేతిక విజ్ఞానాన్ని వివరించినట్లు పేర్కొన్నారు. తొలుత శాస్త్రవేత్తలు నీలిమ, కోటేశ్వరరావు రైతులకు అవగాహన కల్పించారు. ఏడీఏ రవికుమార్, కళాశాల అసోసియేట్ డీన్ హేమంత్కుమార్, ఎంఏఓ అరుణ్బాబు, ఏఈఓ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.