ఆశలు గల్లంతే.. | - | Sakshi
Sakshi News home page

ఆశలు గల్లంతే..

Aug 7 2023 1:22 AM | Updated on Aug 7 2023 1:22 AM

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన పత్తి - Sakshi

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన పత్తి

గత ఏడాది, ఈ ఏడాది

పత్తి ధరలు (క్వింటాకు.. రూ.ల్లో)

నెల 2022 2023

జనవరి 9,000 8,300

ఫిబ్రవరి 10,000 7,700

మార్చి 11,000 7,300

ఏప్రిల్‌ 12,000 7,500

మే 13,000 7,200

జూన్‌ 12,000 7,000

జూలై 12,000 6,900

ఆగస్టు 12,000 6,900

ఖమ్మంవ్యవసాయం: పత్తి ధరపై రైతుల ఆశలు గల్లంతయ్యాయి. పంట సీజన్‌లో ఉన్న ధర కూడా ప్రస్తుతం లేదు. మునుపెన్నడూలేని విధంగా గతేడాది మే నెలలో పత్తి ధర క్వింటా రికార్డు స్థాయిలో రూ.13 వేలు పలికింది. ఈ ఏడాది కూడా ఆ ధర వస్తుందనే ఆశతో రైతులు నిల్వ పెట్టుకోగా క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ. 6 నుంచి 7 వేలకు పడిపోయింది. ప్రసుతం వానాకాలం సీజన్‌ ప్రారంభం కాగా పంటల సాగు పెట్టుబడులకు అవసరాలు పెరిగాయి. దీంతో ఇళ్లలో నిల్వపెట్టిన పత్తిని అమ్ముకోక తప్పని పరిస్థితి నెలకొంది. నెలల తరబడి దాచినా కనీసం సీజన్‌లో పలికిన ధర కూడా లేదని రైతులు దిగులు చెందుతున్నారు. జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో వరి తర్వాత స్థానం పత్తిదే. గతేడాది జిల్లాలో 2,21,600 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అధిక వర్షాలు, తెగుళ్లు, తదితర కారణాలతో దిగుబడి గణనీయంగా తగ్గింది. నీటి పారుదల ప్రాంతాల్లో ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు రాగా, వర్షాధారంగా పండించిన ప్రాంతాల్లో 5 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. జిల్లాలో రైతులు పండించిన పంటలో 30 శాతానికి పైగా పత్తి నిల్వలు ఉన్నట్లు అంచనా. అంటే ఇంకా 3 లక్షల క్వింటాళ్ల వరకు నిల్వ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్‌కు రోజూ నాలుగు నుంచి ఐదు వేల బస్తాలు విక్రయానికి వస్తున్నాయి.

సీజన్‌లో రూ.10 వేలకు పైగా..

అక్టోబర్‌, నవంబర్‌ నుంచి పత్తి సీజన్‌ ప్రారంభమవుతుంది. గతేడాది ఈ సీజన్‌లో పత్తి ధర రూ.10 వేలు, ఆపైన పలికింది. నవంబర్‌ 21న ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రూ.10,529గా నమోదైంది. దీంతో రైతులకు ధరపై మరిన్ని ఆశలు రేకెత్తాయి. ధరను చూసి పంట విక్రయాలు పెరుగుతాయని వ్యాపారులు ఆశించారు. కానీ అందుకు భిన్నంగా రైతులు ఇళ్లలోనే నిల్వ చేసుకున్నారు. మున్ముందు ధర వస్తుందనే ఆశతో పంట విక్రయించలేదు.

జనవరి నుంచి పతనం

గత డిసెంబర్‌ వరకు రూ.9 నుంచి 10 వేల వరకు పలికిన ధర ఈ ఏడాది జనవరి నుంచి క్రమంగా పతనమవుతూ వచ్చింది. జనవరిలో రూ. 8వేలకు పడిపోగా ఫిబ్రవరిలో రూ. 7,700, మార్చిలో రూ.7,300, ఏప్రిల్‌, మే నెలల్లో రూ.7 వేలు పలికిన ధర జూన్‌, జూలై, ఆగస్టులో నేటి వరకు రూ. 6 నుంచి 7 వేల మధ్యనే కొనసాగుతోంది. వానాకాలం పంటల సాగుకు డబ్బు అవసరం కావడంతో ఆశించిన ధర లేకపోయినా రైతులు పంటను విక్రయిస్తున్నారు.

విదేశీ ఎగుమతులు లేకనే..

విదేశాల్లో పత్తి పంట ఆశాజనకంగా ఉండటం, మన దేశం నుంచి ఎగుమతులు లేకపోవటంతో ధరపై ప్రభావం పడింది. దీనికి తోడు పత్తి బేరన్లు, బేళ్లు, బట్టలు ఇతర దేశాల నుంచి ఆశించిన మేరకు ఆర్డర్లు లేకపోవటం, పత్తి గింజల ధర గణనీయంగా పడిపోవటం కూడా ధర పతనానికి ప్రధాన కారణాలని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. పంట సీజన్‌లో పత్తి గింజల(సీడ్‌) ధర క్వింటా రూ. 4,700 ఉండగా, ప్రస్తుతం అన్‌ సీజన్‌ అయినప్పటికీ రూ. 2,800 మాత్రమే పలుకుతోంది. ఇక దారం ధర కిలో ఒక్కంటికి సీజన్‌లో రూ. 380 ఉండగా ప్రస్తుతం రూ. 230 ఉంది.

ఎనిమిది నెలలుగా

పత్తి నిల్వ చేసిన రైతులు

గతేడాది రూ. 13 వేలు పలికిన ధర

ఇప్పుడు రూ. 6 నుంచి రూ.7 వేలకు పడిపోయిన వైనం

పెట్టుబడుల కోసం తప్పని విక్రయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement