అమెరికాలో వాలీబాల్ పోటీలకు ఎంపిక
మంగళగిరి టౌన్ : అమెరికాలో ఎంసీఏఏ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగే ఆ దేశ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే టీమ్కు మంగళగిరి క్రీడాకారుడు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా క్రీడాకారుడు ఈశ్వర్ను స్థ్ధానిక వివిధ పార్టీల నాయకులు సోమవారం శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనవరి నుంచి మే వరకు అమెరికాలో జరిగే ఆ దేశ వాలీబాల్ పోటీల్లో మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన పొండుగల ఈశ్వర్ ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈశ్వర్ అమెరికాలో పుట్టి పెరిగి అక్కడే విద్యను అభ్యసిస్తూ, ఆ దేశంలో జరిగే వాలీబాల్ పోటీలకు పెప్పర్ డైన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంపికయ్యాడని తెలిపారు. ఫిబ్రవరి 12న జరిగే పోటీలలో ఈశ్వర్ టీమ్ తలపడనుందని, గ్రామానికే కాక రాష్ట్రానికి దేశానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో ఈశ్వర్ క్రీడల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అభినందించిన వారిలో స్థానికులు వెంకటేశ్వరరావు, శివరామయ్య, నంద కిషోర్, బ్రహ్మం, అన్నె చంద్రశేఖర్ ఉన్నారు.


