తీరంలో సముద్రస్నానాలు నిలిపివేత
రేపల్లె: మోంథా తుఫాన్ ప్రభావంతో సముద్రం కోతకు గురైందని, తీరంలో సముద్రస్నానాన్ని నిషేధించినట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల సాంబశివరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డివిజన్లోని నిజాంపట్నం, దిండి పరిశావారిపాలెం, నక్షత్రనగర్లలో బీచ్లను మూసివేసినట్లు పేర్కొన్నారు. కార్తికమాసాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఈ ప్రాంతాలకు సబ్డివిజన్ ప్రాంతాలతోపాటు దూరప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారని, ఆయా బీచ్లకు ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు.
పులిచింతలకు 52,532 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ ఆరు క్రస్ట్గేట్లు, ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం 52,532 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు నాలుగు క్రస్ట్గేట్లు రెండు మీటర్లు, మరో రెండు క్రస్ట్గేట్లు మీటర్ ఎత్తు ఎత్తి 48,244 క్యూసెక్కులు, ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం 4,288 క్యూసెక్కులు మొత్తం 52,532 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 75.09 మీటర్లకు చేరుకుందని రిజర్వాయర్లో గరిష్ట స్థాయిలో 7.080 టీఎంసీలకుగాను 6.799 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 55.97 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం ఎగువ నున్న నాగార్జున సాగర్ నుంచి 65,118 క్యూసెక్కులు వస్తుందని ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా స్విమ్మింగ్ జట్ల ఎంపిక పోటీలను ఆదివారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ ఫూల్లో ఆదివారం నిర్వహించారు. వివిధ విభాగాలకు జరిగిన ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి 58 మంది స్విమ్మర్లు హాజరయ్యారు. వీరిలో 28 మంది జిల్లా జట్లుకు ఎంపికై నట్టు పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. సబ్ జూనియర్ విభాగానికి ఎంపికై న 10 మంది ఈనెల 16వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. వింటర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ విభాగానికి ఎంపికై న 15 మంది ఈనెల 22, 23 తేదీల్లో విశాఖలో జరగనున్న రాష్ట్రస్థాయి చాంపియన్షిప్ పోటీల్లోనూ, మాస్టర్స్ క్యాటగిరీకి ఎంపికై న ముగ్గురు నవంబర్ 9వ తేదీన విజయవాడలో జరగనున్న పోటీల్లో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఎంపిక పోటీలను కోచ్ జి.సురేష్ పర్యవేక్షణలో నిర్వహించారు. క్రీడాకారులను అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఏ.రామలింగారెడ్డి, కార్యదర్శి సుబ్బారెడ్డి తదితరులు అభినందించారు.


