
సుబ్రమణ్యేశ్వరునికి నాగపంచమి విశేష పూజలు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మంగళవారం నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయంలోని సుబ్రమణ్యేశ్వరస్వామికి విశేషపూజలు నిర్వహించారు. స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకులు శంకరమంచి రాజేష్శర్మ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుబ్రమణ్వేశ్వరునికి విశేషాలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం అమరేశ్వరున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుబ్రమణ్యేశ్వరుని పూజలలో పలు గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొ న్నారు.
విజయకీలాద్రిపై
ఘనంగా గరుడ పంచమి
తాడేపల్లిరూరల్: సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం గరుడ పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్స్వామి మంగళ శాసనాలతో ఉదయం 9 గంటలకు గరుత్మంతునికి పంచామృతాలతో అభిషేకం, 10 గంటలకు సంతాన ప్రాప్తి కోసం గరుడ హోమం ఘనంగా నిర్వహించామని అన్నారు. పద్మావతి అమ్మవారి మాస తిరునక్షత్ర సందర్భంగా పద్మావతి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు.
75 త్యాళ్లూరు పీఎంశ్రీ ఉన్నత పాఠశాల జాతికి అంకితం
పెదకూరపాడు: జాతీయ స్థాయిలో పల్నాడు జిల్లాలో ఉత్తమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ‘జాతీయ విద్యా విధానం’ ఎన్ఈపీ–2020 ఐదో వార్షికోత్సవం సందర్భంగా భారత్ మండపం న్యూ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్ జాతికి అంకితం చేయగా స్థానికంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్, ఏఎంవో పూర్ణచంద్ర రావు అంకితం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో 75 త్యాళ్లూరు హైస్కూల్ ఉండటం విశేషం. డీఈఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మకమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు పీఎంశ్రీ పథకం ఎంతగానో దోహదపడుతుందని, ఇది పాఠశాలలకు ఒక వరం లాంటిదని అన్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రసారమైన వివిధ కార్యక్రమాలను విద్యార్థులు, అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ చైర్పర్సన్ బి.చంద్రకుమారి, మండల విద్యాశాఖ అధికారి టి.సత్యనారాయణ ప్రధానోపాధ్యాయులు ఎ.శ్రీనివాసరెడ్డి, ఏఈ అనుముల శ్రీనివాసరెడ్డి, క్లస్టర్ సీఆర్ఎంటి శివ తదితరులు పాల్గొన్నారు.
నేడు శివాలయంలో
హుండీ కానుకల లెక్కింపు
పెదకాకాని: శివాలయంలో హుండీ కానుకలు లెక్కింపు కార్యక్రమం బుధవారం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో దేవదాయశాఖ ఆదేశాల మేరకు నియమించిన అధికారి సమక్షంలో ఉదయం 9 గంటలకు హుండీలను తెరిచి కానుకలు లెక్కించడం జరుగుతుందన్నారు. ఆలయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లెక్కింపు కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొంటారన్నారు. కానుకల లెక్కింపులో భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు.

సుబ్రమణ్యేశ్వరునికి నాగపంచమి విశేష పూజలు

సుబ్రమణ్యేశ్వరునికి నాగపంచమి విశేష పూజలు

సుబ్రమణ్యేశ్వరునికి నాగపంచమి విశేష పూజలు