
జీవితంలో యోగా భాగం కావాలి
బాపట్ల: యోగా వలన కలిగే లాభాలను, ప్రయోజనాలను తెలుసుకొని దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ప్రజలకు సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం సూర్యలంక బీచ్లో యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. 10 వేల మంది పాల్గొని యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మరాజు, చీరాల శాసనసభ్యులు ఎం.ఎం.మాలకొండయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో కేర్ యోగా నాచురోపతి మెడికల్ కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు నిర్వహించిన యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నెల రోజులుగా యోగా కార్యక్రమాన్ని జిల్లాలో, మండలాల్లో, ప్రతి పంచాయతీలో జరుపుకుంటున్నామని తెలిపారు. జీవితాన్ని ఆహ్లాదంగా, సంతోషకరంగా మలచుకోవాలని ఉద్దేశంతో ఋషులు పరిశోధించారని అన్నారు. మనం దైనందిన జీవిత ప్రవాహంలో కొట్టుకుపోయే క్రమంలో చిన్న వయసులోనే వృద్ధులుగా తయారవుతున్నామని అన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని అన్నారు. ఎక్కువ సంవత్సరాలు జీవించినప్పటికీ అది ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన, ఆనందదాయకమైన జీవితం గడపటంలేదని అన్నారు. యోగ వలన ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని తెలిపారు. జీవన క్రమంలో వచ్చే ఆరోగ్య సమస్యలు దరిచేరవన్నారు. యోగాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితికి పరిచయం చేసి ప్రపంచానికి పరిచయం చేసిన రోజు ఈ రోజు అని తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలో సూర్యలంక బీచ్ లో జిల్లా స్థాయి యోగా దినోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్గౌడ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ బి.శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి పి.గ్లోరియా, జిల్లా అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సూర్యలంక తీరంలో యోగా దినోత్సవం వేలాది మంది హాజరు

జీవితంలో యోగా భాగం కావాలి