
పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: పాలిసెట్–2025 కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది. గుంటూరు నగర శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రంలో సమన్వయకర్త టి. శేఖర్ పర్యవేక్షణలో సిబ్బంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. శనివారం ఒకటో ర్యాంకు నుంచి 15వేలు ర్యాంకు వరకు పూర్తయింది. ఆదివారం 15,001 నుంచి 32వేలు వరకు ర్యాంకు విద్యార్థులు హాజరుకావాలి. ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సమీపంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ పాత క్యాంపస్, రేపల్లెలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, బాపట్లలోని బాపట్ల పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రాల్లోనూ విద్యార్థులు ఆయా తేదీల్లో ర్యాంకులు వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని అధికారులు సూచించారు.
కృష్ణా నదిలో పడి న్యాయవాది మృతి
రేపల్లె: ప్రమాదవశాత్తూ కృష్ణా నదిలో పడి న్యాయవాది మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ మల్లికార్జునరావు కథనం ప్రకారం.. పట్టణంలోని 7వ వార్డుకు చెందిన కొండపల్లి శ్రీనివాసరావు (48) మానసిక ప్రశాంతత కోసం శుక్రవారం సాయంత్రం పెనుమూడి కృష్ణా నది వద్దకు వెళ్లాడు. కాసేపు పుష్కర ఘాట్పై సేదతీరి కాళ్లు కడుక్కోవడానికి నది ఒడ్డుకు వెళ్లాడు. కాళ్లు కడుక్కుంటూ ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడు శ్రీనివాసరావు గతంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. శ్రీనివాసరావు మృతిపై బార్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.
సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులు

పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం