కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డు | - | Sakshi
Sakshi News home page

కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డు

Jun 14 2025 7:25 AM | Updated on Jun 14 2025 7:25 AM

కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డు

కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డు

బాపట్ల: చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుంది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 14వ తేదీన న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదానం భారత్‌ మండపంలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరుగునుందని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. చీరాల కుప్పడం పట్టు చీరకు ప్రకటించిన జాతీయ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి న్యూ ఢిల్లీలో అందుకోనున్నారు. సంప్రదాయ మగ్గాలపై నేతన్నలు నేసిన చీరాల కుప్పడం చీరలకు మార్కెట్‌ లో ఇప్పటికే కొంత డిమాండ్‌ ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందనుంది. దీంతో చేనేతల కష్టం ఇక ఫలించనుంది. జాతీయ మార్కెట్‌ లోనూ కుప్పడం చీరలు ప్రత్యేకతను సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చీరాల కుప్పడంకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. చేనేత వృత్తినే నమ్ముకుని వందలాది చేనేత కుటుంబాలు బాపట్ల జిల్లా చీరాల పేరాలలో కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నాయి. సంప్రదాయ మగ్గాలపై చేనేత కార్మికులు కష్టపడి నేసిన కుప్పడం చీరలకు ఒకప్పుడు ఎంతో డిమాండ్‌ ఉండేది. యంత్రాల చొరబాటుతో కుప్పడం చీరల ఉత్పత్తి సన్నగిల్లిందని కార్మికులు ఆందోళన చెందుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చేనేతల ఆశలు పునర్జీవం పోసుకున్నాయి. అలనాటి స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మాగాంధీజీ ఇచ్చిన పిలుపు అందుకున్న చీరాల పేరాల చేనేత కార్మికులు విదేశీ వస్త్రాలను వ్యతిరేకించడంలో ప్రధానపాత్ర పోషించారు. నేత వస్త్రాల ఉత్పత్తులకు చీరాల క్షీరపురిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏడాది జనవరి 9వ తేదీన కేంద్ర బృందం సభ్యులు ఇష్‌ దీప్‌, డాక్టర్‌ దివ్యడింగ్రా క్షేత్రస్థాయి పరిశీలనపై బాపట్ల చీరాలలో పర్యటించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కుప్పడం చీరల ప్రదర్శనను కేంద్ర బృందం సభ్యులు, జిల్లా కలెక్టర్‌ కలిసి పరిశీలించారు. ఆ సమయంలోనే చీరాలలో చేనేత వస్త్రాలైన కుప్పడం చీరల ఉత్పత్తులు, అమ్మకాలు, చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై కేంద్ర బృందానికి కలెక్టర్‌ నివేదిక అందజేశారు. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం చీరాల కుప్పడం చీరలకు ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి)కింద గుర్తింపునిస్తూ జాతీయస్థాయి అవార్డును ప్రకటించింది. జాతీయస్థాయి అవార్డును జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి జూలై 14వ తేదీన అవార్డు అందుకోనున్నారు.

ఓడీఓపీ కింద అవార్డు ప్రదానం ఢిల్లీలో అవార్డు అందుకోనున్న బాపట్ల కలెక్టర్‌ జె.వెంకట మురళి చీరాల కుప్పడం చీరకు ప్రాచుర్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement