కొనకళ్ల నారాయణకు వినతిపత్రం అందజేస్తున్న గౌతంరెడ్డి తదితరులు
ప్రైవేటీకరణ ప్రక్రియను విరమించుకోకపోతే 22 నుంచి ఆందోళన
వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడు గౌతంరెడ్డి
సాక్షి, అమరావతి/బస్డాండ్ (విజయవాడ పశ్చిమ): ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి జేబులు నింపుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (వైఎస్సార్టీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మండిపడ్డారు. రూ.లక్ష కోట్ల విలువైన ఆర్టీసీ డిపోలు, భవనాలు, మౌలిక సదుపాయాలను ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
మాజీ సీఎం జగన్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆదుకుంటే.. చంద్రబాబు మాత్రం సంస్థను దివాలా తీయించేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ లీజు ప్రక్రియను విరమించుకోకపోతే ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. తాము విద్యుత్ బస్సులకు వ్యతిరేకం కాదని, ఆ నెపంతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తమ ట్రేడ్ యూనియన్ తరఫున ప్రతి జిల్లాలో వచ్చే సోమవారం కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని, అప్పటికీ స్పందన లేకపోతే మిగిలిన కారి్మకసంఘాల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకున్న వైఎస్ జగన్
విజయవాడ ఆర్టీసీ హౌస్ ఏదుట వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గౌతంరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్రలు పన్నిందని మండిపడ్డారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యంకు వినతి పత్రాలు అందజేశారు.


