సాక్షి, తాడేపల్లి: వెన్నుపోటు పార్టీ ప్రజలపై పన్నుపోటు వేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇంధన ధరలను భారీగా పెంచి చంద్రబాబు జనం నడ్డి విరిచారని.. ప్రజాపాలనలో ఘోర వైఫల్యం చెందారంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీ చేపట్టిన నిరసనలకు పెద్ద ఎత్తున స్పందన లభించిందన్న అప్పిరెడ్డి.. ఇంధన ధరల పెంపుపై తమ నాయకులు అడిగిన ప్రశ్నకు పాలకులు సమాధానం చెప్పలేక పోయారన్నారు.
‘‘ప్రజలకు సమాధానం చెప్పలేక మంత్రులు దూషణలకు దిగుతున్నారు. ప్రతిపక్షాన్ని గౌరవించటం కూడా చేతగాని వారు కూటమి నేతలు. పెట్రోలుపై రూ.31లు ట్యాక్స్ వేసింది చంద్రబాబు కాదా?. డీజిల్ మీద 22 రూపాయలు ట్యాక్స్ వేసిందీ చంద్రబాబే. చివరికి అమరావతి పేరుతో మరో రూ.4 ట్యాక్స్ వేయలేదా?. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తే జగన్ కేవలం ఒక్క రూపాయి మాత్రమే పెంచారు. కేంద్రం గ్యాస్ మీద రూ.50 పెంచితే జగన్ ప్రభుత్వం ప్రజల మీద వేయకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చేశారు
..మరి చంద్రబాబు ఇప్పుడు ఆ పనులు ఎందుకు చేయటం లేదు?. అమరావతి కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద ఉండదా?. రూ.3,400 కోట్ల భారం ప్రజల మీద వేయటం సిగ్గుచేటు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు భారీగా పెరిగాయి. ఇదేనా అనుభవజ్ఞుడి పాలన చంద్రబాబూ?. అమరావతి అద్దాలకు పెట్టే ఖర్చు ప్రజల బాగు కోసం పెట్టలేరా?. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇంధన ధరలను తగ్గించాలి.

..టీడీపీ డీఎన్ఏనే వెన్నుపోటు. రైతుల నుండి అన్ని వర్గాలనూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వైఎస్సార్సీపీ ప్రజల పార్టీ. వివేకా హత్య జరిగింది చంద్రబాబు పాలనలోనే. చంద్రబాబుదే గొడ్డలి పార్టీ. పొరుగు రాష్ట్రాలను చూసైనా చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.


