సాక్షి, చిత్తూరు: చిత్తూరులో మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ సంఘీభావం తెలిపింది. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ మామిడి రైతులతో కలిసి పార్టీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. జీడి నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ ఎదుట వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున మామిడి రైతులు నిరసనల్లో పాల్గొన్నారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, గత ఏడాది మామిడి పంటకు కిలో 12 రూపాయలు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించింది. ఈ ఏడాది మామిడి పంటను తక్కువ ధరకే కిలో 4 నుంచి 5 రూపాయలకు మించి జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేయడం లేదు. జ్యూస్ ఫ్యాక్టరీల యజమాన్యాలు సిండికేట్గా మారి మామిడి రైతులను నిలువు దోపిడి చేస్తున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తోతాపురి మామిడి పంటకు కిలో 15-20 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మామిడి రైతులకు మద్దతుగా నిలవడంతో ముందుగా మామిడి లోడు ట్రాక్టర్లను పోలీసులు లోపలికి పంపించారు. జైన్ ఫ్యాక్టరీ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక, మూడు నుంచి నాలుగు రోజుల పాటు మామిడి రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.


