ప్రతినెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముడుపులు
ఇందులో అచ్చెన్నాయుడు వాటా ఎంతో చెప్పాలి
మాజీ మంత్రులు కన్నబాబు, గోవర్ధన్రెడ్డి, అప్పలరాజు
సాక్షి, అమరావతి: ఆక్వారంగ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మేత ధరలు పెంచడం దారుణమని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్రెడ్డి, సీదిరి అప్పలరాజు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఏకపక్షంగా ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం ఉందని స్పష్టం చేశారు. ధరల పెంపును అడ్డుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని, అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రతినెలా ముడుపులు అందుకుంటూ..
‘ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారు. ఆక్వా రైతులను దోచుకుతింటున్నారు. ప్రతినెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఫీడ్ కంపెనీల నుంచి ముడుపులు అందుతున్నాయి. అందుకే ధరలను ఏకపక్షంగా పెంచినా అడ్డుకోలేదు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించినా ధరలను ఆ మేరకు తగ్గించలేదు. కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత ఆక్వా ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచారు. ముడిసరుకుల ధరలు తగ్గినా మేత ధరలు తగ్గించలేదు. ఆక్వా ఫీడ్ కంపెనీల మాఫియాకు ప్రభుత్వ పెద్దలు దన్నుగా నిలుస్తున్నారు. ప్రతినెలా టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముడుపులు అందుతున్నాయి.
ఆక్వా రైతుల కష్టం టీడీపీ దోపిడీ పాలవుతోంది. ప్రభుత్వానికి తెలియకుండా ధరలు పెంచుతారా? వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఆక్వా రైతుల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆక్వా సిండికేట్ ముడుపుల్లో మంత్రి అచ్చెన్నాయుడు వాటా ఎంతో చెప్పాలి. ఇప్పటికే కరెంట్ లేక, డీజిల్ ఇవ్వక ఆక్వా రైతులు కుదేలయ్యారు. వారిపై ఫీడ్ ధరల పెంపు మరో పిడుగుపాటుగా పరిణమించింది. ధరలను తక్షణం తగ్గించకపోతే ఆక్వా రైతుల తరఫున ఉద్యమిస్తాం’ అని కన్నబాబు, కాకాణి, అప్పలరాజు హెచ్చరించారు.


