
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ కార్మికులపై టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ రావు(Palla Srinivas Rao) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాలామంది పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పల్లా వ్యాఖ్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు మండిపడ్డారు. ఊసరవెల్లి రాజకీయాలను పక్కనపెట్టి కార్మికులకు క్షమాపణలు చెప్పాలంటూ పల్లాను డిమాండ్ చేశారు.
పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?. అంత ప్రేమ ఉంటే.. మహానాడులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఎందుకు చర్చించలేదు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని కార్మికులకు క్షమాపణలు చెప్పాలి. సొంత గనులు లేక స్టీల్ ప్లాంట్కు నష్టాలు వస్తున్నాయి. ఇకనైనా తన ఊసరవెల్లి రాజకీయాలను పల్లా పక్కనపెడితే మంచిది’’ అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ జేఏసీ(Vizag Steel Plant JAC) నాయకులు అన్నారు.
‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)లో ఘోస్ట్ ఉద్యోగులు ఉన్నారు. పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారు. 400 మంది కార్మిక నాయకులు ఈ లిస్ట్లో ఉన్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే నాలుగేళ్లలో ప్లాంట్ మూసేయాల్సి ఉంటుంది’’ అని పల్లా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమను అవమానపరిచేలా ఉన్నాయంటూ కార్మికులు పల్లాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉర్సా భూముల వ్యవహారం.. మంత్రి లోకేష్కు మాజీ మంత్రి సవాల్