
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది
నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పింది
ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు కొమ్మినేని అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం
‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ‘ఎక్స్’ వేదికగా శుక్రవారం ఆయన పోస్టు చేశారు. ‘నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధిచెప్పింది.
కొమ్మినేని అరెస్టు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు తీవ్ర భంగకరమని సుప్రీంకోర్టు చెప్పడం ముదావహం’ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘అమరావతి నిర్మాణం పేరిట రూ.వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు.
అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన నుంచి మళ్లించడానికి, చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని ‘సాక్షి’ మీడియా యూనిట్ ఆఫీసుల మీద, కార్యాలయాల మీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.
చంద్రబాబు తన తప్పు తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీకి, ‘సాక్షి’ మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడడంతోనే ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర పన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో యాంకర్గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ ఇవాళ సుప్రీంకోర్టు ఇచి్చన ఆర్డర్ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటుకావు. సత్యమేవ జయతే’ అని పేర్కొన్నారు.

చంద్రబాబుకు ఇదొక హెచ్చరిక
కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సంకెళ్లను న్యాయ వ్యవస్థ బద్దలు కొట్టింది. కొమ్మినేని అరెస్ట్ అక్రమం అని దేశం మొత్తం తెలిసింది. సాక్షి కార్యాలయాలపై తన కార్యకర్తలను, నాయకులను ఉసిగొల్పి దాడులు చేయించిన చంద్రబాబు అరాచకానికి తాజా తీర్పు ఒక హెచ్చరిక. చంద్రబాబు కుట్రపూరిత విధానాలను న్యాయస్థానం ఉత్తర్వులు ఎత్తిచూపాయి.– పూనూరు గౌతంరెడ్డి, వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడు
బాబు సిగ్గుతో తలదించుకోవాలి
కొమ్మినేని అరెస్ట్ అక్రమమని తన తీర్పుతో కూటమి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు బుద్ధి చెప్పింది. చంద్రబాబు సర్కార్ పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలకు ఈ తీర్పు గట్టి హెచ్చరిక. ఇకనైనా చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. అక్రమ అరెస్టులను ఆపాలి. –పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ
తల ఎక్కడ పెట్టుకుంటారు..
కొమ్మినేని అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చంద్రబాబుకు చెంపపెట్టు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సంకెళ్లను న్యాయ వ్యవస్థ బద్దలు కొట్టింది. ఇప్పుడు చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటారు. – కల్పలత, ఎమ్మెల్సీ
సుప్రీం తీర్పుతోనైనా బాబు కళ్లు తెరవాలి
కొమ్మినేనిది అక్రమ అరెస్ట్ అంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుతో అయినా చంద్రబాబు కళ్లు తెరవాలి. చంద్రబాబు మెప్పు కోసం రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్న పోలీసులు పునరాలోచన చేయాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే వారిని కోర్టుల్లో నిలబెడతాం. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ
కొమ్మినేని అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురురెబ్బ. కనీస నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేయడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం. – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
క్షమాపణ చెప్పాలి
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన అంశంలో మంగళగిరి కోర్టు న్యాయమూర్తి, డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, తాజాగా సుప్రీంకోర్టు జర్నలిస్టుల భావప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ వెంటనే విడుదల చేయాలని ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు. తెనాలిలో దళిత, ముస్లిం యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తప్పు పట్టడం కూడా ప్రభుత్వ నేతలను తలదించుకునేలా చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ అందరూ కొమ్మినేని అరెస్టుతో ఆగకుండా సాక్షి కార్యాలయాలపై దాడులకు ప్రేరేపించినందుకు తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాగే కొమ్మినేని, కృష్ణంరాజులపై కేసులను ఉపసంహరించుకోవాలి. – ఈదర గోపీచంద్, సామాజిక విశ్లేషకులు