ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా అడుగులు

Steps towards Health Andhra Pradesh - Sakshi

వైద్య శాఖ మంత్రి విడదల రజిని 

సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నారని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్‌ బాఘెల్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం ఆయుష్మాన్‌ భారత్‌–ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్యయోజన (ఏబీ పీఎంజేఏవై), వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాలకు సంబంధించి ప్యానల్‌ ఆస్పత్రుల సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రజిని మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద 3,257 ప్రొసీజర్‌లలో ఉచితంగా వైద్యం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం ఏపీ అని చెప్పారు. ఈ పథకం కోసం ఏటా రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీ,, ఆయుష్మాన్‌ భారత్‌ కింద కేవలం 1,055 ప్రొసీజర్లకు మాత్రమే ఉచితంగా చికిత్స అందేదని, ప్రస్తుతం ఏకంగా 3,257 రోగాలకు చికిత్స అందుతోందని చెప్పారు.

రాష్ట్రంలో ఏకంగా 90 శాతం కుటుంబాలు ఈ సౌకర్యం పొందుతున్నాయని వివరించారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏపీలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 10,032 డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేశామన్నారు. నాలుగేళ్లలో 49 వేలకు పైగా నియామకాలు చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరును కేంద్ర సహాయ మంత్రి బాఘెల్‌ ప్రశంసించారు. కార్యక్రమంలో వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ ట్రస్ట్‌ సీఈవో హరేందిర ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top