నెల్లూరులో ఆర్టీసీ బస్సు చోరీ | RTC bus stolen in Nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరులో ఆర్టీసీ బస్సు చోరీ

Jul 24 2025 3:29 AM | Updated on Jul 24 2025 3:29 AM

RTC bus stolen in Nellore

ఫాస్ట్‌ట్యాగ్‌తో బస్సు ఆచూకీ లభ్యం

నెల్లూరు సిటీ/ఆత్మకూరు: నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ఓ వ్యక్తి బస్సును చోరీ చేయడంతో దాదాపు రెండు గంటల పాటు ఆర్టీసీ అధికారులు హైరానా పడ్డారు. చివరికి ఫాస్ట్‌ట్యాగ్‌తో బస్సు ఆచూకీ కను­గొన్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీ­రాము­లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు ఏఎస్‌పేట నుంచి మంగళవారం సాయంత్రం ప్రయా­ణికులతో బయ­లుదేరి నైట్‌ హాల్ట్‌గా నెల్లూ­రు బస్టాండ్‌కు చేరింది. బుధవారం ఉదయం 5 గంటలకు తిరిగి ఏఎస్‌­పేటకు బయలుదేరాల్సి ఉంది. డ్రైవర్, కండెక్టర్‌ బస్టాండ్‌లోనే నిద్రపోయారు. 

ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బుధవారం తెల్లవారు జాము­న బస్సును అపహరించాడు. 4 గంటలకు నిద్రలే­చిన కండక్టరు, డ్రైవర్‌ బస్టాండ్‌లో బస్సు కనిపించకపోవడంతో ఆత్మకూరు, నెల్లూరు డిపో మేనే­జర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు టోల్‌­గేట్ల సిబ్బందిని అప్రమత్తం చేశా­రు. అధికారులు బస్సు ఆచూకీ కోసం ప్రయత్ని­స్తుండగా, బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజా వద్ద సంగం వైపు క్రాస్‌ అయినట్లు ఫాస్ట్‌ట్యాగ్‌ మెసేజ్‌ వచ్చింది. సంగంలో బస్సును ఆపేందుకు ప్రయత్నించగా ఆగలేదు. 

నెల్లూరుపాళెం సెంటర్‌ వద్దకు వచ్చిన బస్సును పలువురు చాకచక్యంగా నిలిపి బస్సు నడిపిన వ్యక్తిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. ఆత్మకూరు ఎస్సై ఎస్‌కే జిలానీకి ఫిర్యాదు చేశారు. బస్సును చోరీ చేసిన వ్యక్తిని విడవలూరు మండలం కంచరపాళెంకు చెందిన కృష్ణగా గుర్తించారు. అతనికి మతిస్థిమితం లేదని తెలిపారు. నెల్లూరు పోలీసులకు, ఆర్టీసీ అధికా­రు­లకు సమా­చారం ఇచ్చారు. కృష్ణను నెల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు ఎస్సై జిలానీ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement