నెల్లూరు(బారకాసు): నెల్లూరులో కులాలు, మతాలకతీతంగా నిర్వహించుకునే వరాల, కోర్కెల రొట్టెల పండుగ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు... కొత్త కోర్కెలతో రొట్టెలు తీసుకునేందుకు వచ్చిన భక్తులతో బారాషహీద్ దర్గా ప్రాంగణం తొలి రోజు కిటకిటలాడింది. వరాల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో నిండిపోయింది.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాలవారు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి తమ కోర్కెల రొట్టెలను మార్పిడి చేసుకున్నారు. మత బోధకులైన యుద్ధవీరుల త్యాగనిరతిని స్మరిస్తూ వారి సమాధులను దర్శించుకున్నారు. ఐదు రోజులపాటు ఈ పండుగ జరగనుంది.
ప్రతి కోర్కె రొట్టెకు ప్రత్యేక ఘాట్
స్వర్ణాల చెరువులో సంప్రదాయబద్ధంగా స్నానమాచరించి.. రొట్టెలు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీ. ఈసారి భక్తులు ఇబ్బంది పడకుండా ప్రతి కోర్కె రొట్టెకు ఒక ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు. భక్తులు ఏ కోర్కెతో వచ్చారో ఆ ఘాట్లోకి వెళ్లి తమకు కావాల్సిన రొట్టెను అందుకుంటున్నారు. గతంలో తమ కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలను వదులుతున్నారు. ఆరోగ్యం, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, గృహ, సౌభాగ్యం, వివాహం, విదేశీయానం రొట్టెల బోర్డులను ఏర్పాటు చేశారు.
భక్తిశ్రద్ధలతో మొహర్రం
బనగానపల్లె: మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రంను శుక్రవారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తరవాత ఏపీలో ఆ స్థాయిలో ఇక్కడ మాతం నిర్వహిస్తారు. ఊరేగింపులో బనగానపల్లె నవాబు వంశీయులు మీర్ఫజలే అలీఖాన్, ఆయన కుమారుడు గూలంఅలీఖాన్తో పాటు ఎక్కువ సంఖ్యలో షియా మతస్తులు నల్లటి వస్త్రాలు ధరించి భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వీరంతా శోకగీతాలు అలపిస్తూ బ్లేడ్లు, చురకత్తులతో ఎదలు, వీపు పైనా మాతం నిర్వహించారు.


