డీఎస్సీ.. మంత్రులు సమాధానం చెప్పలేరా: పర్వతనేని | MLC Parvathaneni Chandrasekhar Reddy Serious On CBN Govt Over DSC | Sakshi
Sakshi News home page

డీఎస్సీ.. మంత్రులు సమాధానం చెప్పలేరా: పర్వతనేని

Jun 14 2026 12:46 PM | Updated on Jun 14 2026 1:18 PM

MLC Parvathaneni Chandrasekhar Reddy Serious On CBN Govt Over DSC

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్‌ రెడ్డి ఆరోపించారు. అక్రమాలపై ప్రతిపక్షంగా తాము నిరంతరం పోరాడుతున్నామని, అయితే ప్రభుత్వం, మంత్రులు.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారులను ముందుకు నెడుతున్నారని విమర్శించారు. అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్‌ తాడేపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏపీలో డీఎస్సీ పరీక్ష రాసిన 3.50 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం, మంత్రులు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అధికారులను ఎందుకు ముందు పెడుతున్నారు. డీఎస్సీ నిర్వహణపై మంత్రులు కాకుండా అధికారులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఎస్‌సీఈఆర్టీ (SCERT)లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు రావడం, అలాగే టీజీటీ తెలుగులో ఆరో ర్యాంకు సాధించడం అనేక అనుమానాలకు కారణమైంది.

ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో నవీన్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నవీన్ ద్వారానే అనేక మందికి ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి సరైన స్పందన లేదు. ఈవిషయం కోర్టులో ఉంది, చెప్పలేం అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాటవేత ధోరణి ఉంది. ఆయన ఎప్పుడూ స్పోర్ట్స్ డీఎస్సీ గురించి మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు. ఫలితాలు మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణలోనే అనేక అవకతవకలు జరిగాయి. రిజర్వేషన్ల ఉల్లంఘన వల్ల వేలాది మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయారు. సీబీఎస్ఈ, నవోదయ ఇంగ్లిషు మీడియం విద్యార్థులను డీఎస్సీకి దూరం పెట్టడం అన్యాయం.

టెట్ రాసినా కూడా వేలాది మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనే నార్మలైజేషన్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. జిల్లా స్థాయి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం నార్మలైజేషన్ ప్రక్రియను ఎందుకు తెచ్చింది?. నార్మలైజేషన్ పేరుతో నచ్చిన సెషన్స్‌లో 7, 8 మార్కులు కలిపి అక్రమాలకు పాల్పడ్డారు. రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై నిరుద్యోగుల పొట్టకొట్టారు. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులను మానసికంగా వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సోషల్ మీడియా వింగ్ నిరుద్యోగులపై రకరకాల ముద్రలు వేస్తూ అవమానిస్తోంది. కష్టపడి చదువుకున్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మానసిక వ్యధకు గురిచేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement