Man Cheating Of Rs 1 Cr On Pretext Of Exchanging Rs 2000 Currency Notes In AP - Sakshi
Sakshi News home page

అయ్యో.. రూ.10లక్షల లాభం ఆశచూపి రూ.90లక్షలు ఫసక్‌!

Published Tue, Jun 27 2023 9:26 AM

Man Cheating Rs 1 Cr On Pretext Of Exchanging Currency Notes Ap - Sakshi

పార్వతీపురం: ‘రెండు వేల రూపాయల నోట్లు రూ.కోటి ఇస్తాం. మీరు రూ.500 నోట్లు రూ.90లక్షలు ఇవ్వండి చాలు..’ అని నమ్మబలికిన ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. రూ.పది లక్షలు లాభం ఆశ చూపించి రూ.90­లక్షలతో ఉడాయించారు. ఈ ఘటన పార్వతీపురంలో సోమవారం జరిగింది. పార్వతీపురం రూరల్‌ ఎస్‌ఐ వై.సింహాచలం తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురానికి చెందిన ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్‌.అనిల్‌కుమార్‌ ఓ ప్రైవేట్‌ బ్యాంకులో రుణాలు ఇప్పిస్తుంటారు.

వారి వద్దకు స్థానిక వడ్డీ వ్యాపారుల ద్వారా వారం రోజుల కిందట ఎన్‌.చక్రపాణి(కాకినాడ), ఎస్‌కే నజీమ్‌(భీమవరం) వచ్చి కలిశారు. తమకు తెలిసినవారి వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇస్తే... రూ.2వేల నోట్లు రూ.కోటి ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరిని పార్వతీపురం పిలిపించి ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్‌.అనిల్‌కుమార్‌లతో మాట్లాడించారు. ఒకే రోజు రూ.10 లక్షలు వస్తుందని ఆశతో ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్‌.అనిల్‌కుమార్‌ వారితో ఒప్పందానికి అంగీకరించారు.

తమ వద్ద ఉన్న నగదుతోపాటు స్నేహితులు, బంధువుల వద్ద కొంత తీసుకువచ్చి రూ.90 లక్షలను సోమవారం ఆ వ్యక్తులకు ఇచ్చారు. కొద్దిసేపు ఇక్కడే ఉంటే రూ.కోటి తెస్తామని చెప్పి వెళ్లిన ఇద్దరు తిరిగి రాలేదు. దీంతో తాము మోసపోయినట్టు గుర్తించిన ఆబోతుల అనిల్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యవర్తులుగా వ్యవహరించిన చక్రపాణి, నజీమ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిందితులను పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

చదవండి: ఏపీలో బంగారం తవ్వకాలు! ఎన్‌ఎండీసీ రూ. 500 కోట్ల వ్యయం..

Advertisement
Advertisement