సాక్షి,తాడేపల్లి: రైతులపై దాడి చేసి, తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.
పొన్నూరు మండలం మామిళ్లపల్లి రైతులు పండించిన మొక్కజొన్న పంటను వారి షెడ్డులో దాచుకుంటే, దానిపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన రైతులపై కూడా దాడులు జరిపారు. ఈ దాడిలో మామిళ్లపల్లి రైతులు గాయపడ్డారు. తర్వాత తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. టీడీపీ గూండాల దాడి ఘటనను బాధిత రైతులు వైఎస్ జగన్కు వివరించారు. ‘దాడి చేసి తిరిగి మా పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదుగురు మహిళా రైతులపై కూడా అట్రాసిటీ కేసులు పెట్టారని వాపోయారు.

ఈ సందర్భంగా బాధిత రైతులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ‘రైతుల గోడౌన్పై దాడి దుర్మార్గపు చర్య. తిరిగి బాధిత రైతులపైనే అట్రాసిటీ కేసులు పెడతారా?. బాధిత రైతులకు అండగా ఉంటా. లీగల్ సెల్ ద్వారా అవసరమైన న్యాయపోరాటం చేద్దాం’ అని హామీ ఇచ్చారు.





