అవాస్తవాలను అడ్డగోలుగా ప్రచారం చేసి... వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి... ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. కూటమి ప్రభుత్వం ఏదైనా చేసిందంటే అందులో స్వప్రయోజనాలే ఉంటాయి తప్ప, రాష్ట్ర ప్రజలకు అది ఉపయోగపడేది మాత్రం అస్సలు ఉండదు. ఇందుకు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చే నిదర్శనం.
అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చు రూ. 401 కోట్లట. ఇక్కడ అమరావతి మొత్తం భవనాల ఖర్చు రూ. 2316 కోట్లు కాగా, డిజైన్లకే రూ. 401 కోట్లు ఖర్చు చూపెట్టారు. కేవలం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజెన్లకే వందల కోట్ల రూపాయిలు నీళ్లలా ఖర్చు చేశారు.
ఇంతటి ఖర్చు ఎవరికి ఉపయోగం. ఈ ఖర్చును చూస్తే డిజైన్లకు అన్ని వందల కోట్లా అని ముక్కున వేలేసుకోకమానరు ప్రజలు.. అదే సమయంలో మన బాబుగారు చేస్తున్న పాలన కదా ఇలాగే ఉంటుంది అని నవ్వుకోక మానరు.
రుషికొండ ప్రభుత్వ భవనాల ఖర్చుకే ఏడుపులు..
మరి ఆనాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. రుషికొండలో ప్రభుత్వ భవనాలకు అయిన మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 400 నుంచి 450 కోట్లు మధ్య ఉంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు అవుతున్న ఖర్చుతో ఇది సమానం. మరి ఆనాడు చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలనే ఉద్దేశంతో జగన్ ఆ కార్యక్రమం చేపడితే అప్పడంతా చెత్త ఏడుపులే కనిపించాయి.
ఆ భవనాలపై వికృత రాజకీయం
రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. రుషికొండపైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింతగా పెంచేలా వైఎస్ అద్భుత ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే, దానిపై వికృత రాజకీయం చేసింది.
తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎప్పుడూ కపట రాజకీయాలు చేస్తూ వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికే లీకైపోయి, నీరంతా గదుల్లో ప్రవహించగా.. రూ. 400 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఐకానిక్ భవనాలను చూసి టీడీపీ అధినేతలు ఏడుపు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే విష ప్రచారం చేశారు. అవి ప్రభుత్వ భవనాలే అని చెప్పినా శృతిమించి మరీ కపట రాజకీయం చేసింది.
చివరకు అవి ప్రభుత్వ భవనాలేనని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అంగీకరించింది. అప్పుడొక ఏడుపు.. ఇప్పుడొక కవరింగ్. ఇది బాబుగారి రాజనీతి పాలన.
మరి ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు రూ 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే దాన్ని ఏమనాలి. దీన్ని స్వలాభాపేక్ష అనకుండా ఏమంటారు చంద్రబాబు.
అభివృద్ధికి రూపాన్ని చూపెట్టిన నాయకుడు జగన్
ఆనాడు అభివృద్ధికి అసలైన రూపాన్ని చూపెట్టిన నాయకుడు వైఎస్ జగన్. ఏ విషయంలోనైనా జగన్ మార్క్ పాలన అనేది కనబడింది. అందుకు రిషికొండలో వైఎస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ భవనాలే ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వ భవనాలను చూసి తొలుత అగ్లీ(చెత్త) ఏడుపు ఏడ్చింది మీరే.. ఆ తర్వాత శభాష్ అంటూ మెచ్చుకున్నది మీరే. ఇది కూటమి పెద్దల తీరు.
అయితే, మరి ఈరోజు కూటమి పెద్దలు చేస్తున్నదేమిటి?, అభివృద్ధి అంటూ పైకి కల్లిబొల్లి మాటలు చెప్పే నేటి ప్రభుత్వ పెద్దలు.. అసలైన అభివృద్ధికొచ్చేసరికి మాత్రం తేలిపోతున్నారు. ఇక్కడ రిషికొండ భవనాలను, అమరావతి గవర్నమెంట్ భవనాలను పోల్చి చూస్తే.. కూటమి పెద్దలది కేవలం బ్లూప్రింట్ల పాలన అనేది అందరికీ అర్థమవుతోంది. నేటి ప్రభుత్వ పాలనలో డిజైన్ల వంటి వాటికే వందల కోట్ల రూపాయిలను వెచ్చిస్తున్న వైనం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.
మరి ఇప్పుడు ఎవరికోసం ఈ దుబారా?
అయితే ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే.. కేవలం డిజైన్లకే ఇంత ఖర్చు అయితే పూర్తి నిర్మాణానికి ఎంత అవుతుంది?, ఇది అభివృద్ధా… లేక దుబారా ఖర్చా?, ప్రజల డబ్బుతో డిజైన్ల పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ఖర్చులు ఏంటని చర్చించుకుంటున్నారు.


