సాక్షి,అమరాతి: ఏపీలో హైఅలర్ట్. అడవిని వదిలిన మావోయిస్టు అగ్రనేతలు రాష్ట్రంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 60-70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసు వర్గాలు గుర్తించాయి. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో 28 మంది మావోయిస్టులు పట్టుబడగా.. ఏలూరులో మరో 12 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు దృష్టిసారించారు.
మరోవైపు ఇవాళ ఉదయం విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. మంగళవారం కానూర్(పెనుమలూరు) కొత్త ఆటోనగర్లోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. బిల్డింగ్ను ఖాళీ చేయించి మొత్తం 27 మంది మావోయిస్టు సానుభూతి పరుల్ని అదుపులోకి తీసుకుంది.
ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోయిస్టులు, సానుభూతిపరులు పట్టణాళ్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులకు ఆరుగురు అనుమానాస్పద రీతిలో పట్టుబడ్డారు. వీళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. న్యూ ఆటోనగర్లోని ఓ భవనాన్ని షెల్టర్ జోన్గా మార్చుకున్నారని నిర్ధారణ అయ్యింది.
భారీగా ఆయుధాలు డంప్ చేసి ఉంటారని భావించిన అధికారులు.. అక్టోపస్ పోలీసుల సాయంతో భవనాన్ని జాగ్రత్తగా ఖాళీ చేయించారు. ఆపై అందరినీ అదుపులోకి తీసుకుని టాస్క్ఫోర్స్ ఆఫీస్కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ పరిణామంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదీ చదవండి: విజయవాడలో మావోయిస్టుల కలకలం.. 27 మంది అరెస్ట్


