కర్షకుల ‘సేవకు’ కత్తెర | Farmer service centers reduced by half | Sakshi
Sakshi News home page

కర్షకుల ‘సేవకు’ కత్తెర

Jun 9 2025 2:26 AM | Updated on Jun 9 2025 2:26 AM

Farmer service centers reduced by half

రైతు సేవా కేంద్రాలు సగానికి కుదింపు

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన క్రమబద్దీకరణ 

పంటల సాగు ఆధారంగా సర్దుబాటు

సాక్షి, అమరావతి: కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చింది మొదలు, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ప్రజారంజక విధానాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజారంజక పాలనపై ఆయన ముద్రను చెరిపేయడమే ఈ నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ జాబితాలో ఇప్పటికే సచివాలయాలు చేరగా, తాజాగా  రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) వంతయ్యింది.  క్రమబద్దీకరణ పేరిట కూటమి ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 

హేతుబద్దీకరణ పేరుతో  రెండు లేదా మూడు  సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్‌గా విలీనం చేశారు.  తాజాగా వ్యవసాయ, సంబంధిత శాఖల హేతుబద్ధీకరణ సాకుతో రైతు సేవా కేంద్రాలను (ఆర్‌ఎస్‌కే), వీటిలో పనిచేస్తున్న సిబ్బందిని సగానికి పైగా కుదించేస్తున్నారు. దీంతో ఆర్‌ఎస్‌కేలు రైతు సేవలకు దూరం అయ్యే పరిస్థితి  నెలకొంది. ‘ప్రజల ఇంటికే పాలనను తీసుకొస్తాం’ అని ఒక వైపు చెబుతున్న ప్రభుత్వం మరో వైపు ‘హేతుబద్దీకరణ’ పేరుతో ప్రజలకు, రైతులకు పలు సేవలను దూరం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

పేరు మార్పు నుంచి నిర్వీర్యం వరకూ.. 
ప్రజల ముంగిట పౌరసేవలు అందించాలన్న సంకల్పంతో జగన్‌ హయాంలోని ప్రభుత్వం ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున  10,965 సచివాలయాలను ఏర్పాటు చేసింది. వీటికి అనుబంధంగా రైతు సేవలకు  10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు– ఇప్పటి ఆర్‌ఎస్‌కే­లు) ఏర్పాటయ్యాయి.  గ్రామ స్థాయిలో రైతులకు సేవలు, సంక్షేమ ఫలాలు అందించాలన్నది దీని ప్రధాన లక్ష్యం. 

ఆర్‌బీకేల సేవల విషయంలో ఉద్యో­గ నియామకాల ప్రతిపాదన సంఖ్య 21,796కాగా,  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశలవారీగా పట్టభద్రులైన 15,667 వ్యవసాయ (6,162), ఉద్యాన (2,303), పట్టు (377), మత్స్య (720), వెటర్నరీ (6,105) సహాయకులను నియమించింది. మిగిలిన వారిని నియమించేందుకూ అప్పట్లో కసరత్తు ప్రారంభించింది. సచివాలయాల పరిధిలోనే వీరి నియామకాలు జరిగినప్పటికీ, ఆర్‌బీకేలు కేంద్రంగా సేవలందించేవారు. కూటమి ప్రభుత్వం అధికా­రంలోకి వచ్చింది మొదలు పేరు మార్పుసహా రైతు సేవా కేంద్రాల నిర్వీర్యమే  లక్ష్యంగా పని చేస్తోంది.  

సచివాలయాల తరహాలోనే ఆర్‌ఎస్‌కే క్లస్టర్స్‌ 
కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 10,965 సచివాలయాలు 5,678 క్లస్టర్స్‌గా (విలీనం) మారాయి. ఇదే తరహాలోనే 10,778 ఆర్‌ఎస్‌కేలను సగానికి సగం కుదించి క్లస్టర్స్‌గా మార్చడానికి కూటమి ప్రభుత్వం తాజాగా సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చేపడుతున్న ఈ ప్రక్రియలో సిబ్బందిని కూడా అదే పరిధిలో సర్దుబాటు చేస్తున్నారు. గతంలో స్థానికంగా సాగు విస్తీర్ణాన్ని బట్టి వీఏఏ (గ్రామ వ్యవసాయ సహాయకులు), వీహెచ్‌ఏ (గ్రామ ఉద్యాన సహాయకులు) వీఎస్‌ఏలు (గ్రామ పట్టు సహాయకులు) ఉండేవారు. 

కొన్ని చోట్ల వ్యవసాయ, ఉద్యాన సహాయకులు, మరికొన్ని చోట్ల గ్రామ పట్టు సçహాయకులు ఉండేవారు. తీర మండలాల్లోని ఆర్‌బీకేల్లో మత్స్య సహాయకులే ఇన్‌చార్జిలుగా ఉండేవారు. స్థానికంగా ఉండే పాడి సంపద ఆధారంగా దాదాపు మెజార్టీ ఆర్‌బీకేల్లో గ్రామ పశుసంవర్ధక సహాయకులు ఉండేవారు. ప్రభుత్వ తాజా ప్రతిపాదనల ప్రకారం,  ఇక నుంచి సచివాలయ క్లస్టర్‌ ప్రాతిపదికన ఆర్‌ఎస్‌కే క్లస్టర్‌లో ఒకరు మాత్రమే ఉంటారు. వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఏలలో ఎవరో ఒకరిని మాత్రమే ఉంచేలా సర్దుబాటు చేస్తున్నారు. మిగిలిన వారిని సచివాలయాల్లో ఇతర సేవలకు సర్దుబాటు చేస్తారు. 

రెండు వేల ఎకరాలకు ఒకరు.. 
కాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతి 2 వేల ఎకరాల విస్తీర్ణం ప్రాతిపదికన ఆర్‌ఎస్‌కేలను క్లస్టర్స్‌ పరిధిలోకి తీసుకొస్తోంది. స్థానికంగా వ్యవసాయ/ ఉద్యాన/పట్టు పంటల సాగు విస్తీర్ణం ఏవి ఎక్కువగా ఉంటే వాటి ఆధారంగా సహాయకులను నియమిస్తారు. అంటే ప్రతీ 2 వేల ఎకరాలకు ఒక ఆర్‌ఎస్‌కే ప్రతినిధి మాత్రమే ఉంటారన్నమాట. తక్కువ విస్తీర్ణం ఉన్న ఆర్‌ఎస్‌కేలను విలీనం చేస్తారు. విలీనం అనంతరం క్లస్టర్‌ కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మిగిలినవి ‘పేరుకు మాత్రం కేంద్రాలు’గా మిగలనున్నాయి.  

విస్తీర్ణం ఎక్కువగా ఉన్న క్లస్టర్స్‌కు అవసరం మేరకు ఏఈవో, ఎంపీఈవోలను అదనంగా కేటాయిస్తారు.  వ్యవసాయ, ఉద్యాన, పట్టు విస్తరణ అధికారులుగా పదోన్నతులు కల్పించిన ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్స్‌ను కూడా ఈ సర్దుబాటు పరిధిలోకి తీసుకురావడం గమనార్హం.  రేషనలైజేషన్‌ ప్రక్రియ ఓ కొలిక్కి తీసుకువచ్చి ఆ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. దీనికి సంబం«ధించి త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement