వైఎస్ జగన్‌: బెడ్ లేదనే మాట ఎట్టిపరిస్థితుల్లో రాకూడదు | YS Jagan's Review Meeting on Corona Prevention's and Precautions with Officials - Sakshi
Sakshi News home page

‘బెడ్ లేదనే మాట ఎట్టిపరిస్థితుల్లో రాకూడదు’

Jul 28 2020 2:56 PM | Updated on Jul 28 2020 6:06 PM

CM Jagan Spandana Review Meeting Over Coronavirus Preventives - Sakshi

పేషెంట్ ఆరోగ్యాన్ని బట్టి అర గంటలోగా బెడ్‌ కేటాయించాలి. వీటన్నింటికి కలెక్టర్, జేసీలను తప్పనిసరిగా బాధ్యులను చేస్తా. ఏ ఆస్పత్రి కూడా నిరాకరించే ధోరణి ఉండకూడదు. అలా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం.

సాక్షి, తాడేపల్లి: కరోనాపై అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ వచ్చిందన్న అనుమానం రాగానే ఎక్కడకు వెళ్లాలి? ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి? ఎవరికి కాల్‌ చేయాలన్నదానిపై.. వివరాలు అందరికీ తెలియజేయాలని అన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కరోనా గురించి పోస్టర్లు ఉంచాలని అధికారులకు సూచించారు. కరోనా నివారణ చర్యలు, జిల్లాల్లో పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

‘104, 14410 కాల్‌ సెంటర్‌ నంబర్లు ఇచ్చాం. జిల్లాలో కోవిడ్‌ కంట్రోల్‌ రూం కాల్‌ సెంటర్‌ నంబర్‌ ప్రకటనలు ఇచ్చాం. ఈ మూడు ప్రధాన నంబర్లకు ఎవరైనా కాల్‌ చేసినప్పుడు.. సమర్థవంతంగా పనిచేసేలా చేయాలి. అధికారులు.. కాల్‌ చేసి కాల్‌ సెంటర్ల పనితీరును పర్యవేక్షించాలి. కాల్‌ రాగానే సంబంధిత వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? తనిఖీ చేయాలి. కాల్‌ చేయగానే స్పందించే తీరును కచ్చితంగా పర్యవేక్షించాలి. ఆ నంబర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? చెక్‌ చేయాలి. కోవిడ్‌ పాజిటివ్‌ కేసును గుర్తించిన తర్వాత.. హోం క్వారంటైన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌, జిల్లా కోవిడ్‌ ఆస్పత్రి.. రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులకు ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా పంపిస్తాం.

హోంక్వారంటైన్‌ కోసం ఇంట్లో వసతులు ఉంటే రిఫర్‌ చేస్తాం. ఇంట్లో ప్రత్యేక గది లేని పక్షంలో వారిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు రిఫర్‌ చేస్తాం. హోంక్వారంటైన్‌లో ఉన్న ఆ వ్యక్తిని పూర్తిగా పర్యవేక్షించాలి. డాక్టరు తప్పనిసరిగా విజిట్‌ చేయాలి. వారికి మందులు అందుతున్నాయా? లేదా? చూడాలి. క్రమం తప్పకుండా.. వారి ఆరోగ్య వివరాలను కాల్‌ చేసి కనుక్కోవాలి కోవిడ్‌ కేర్‌ సెంటర్లో డాక్టర్లను అందుబాటులో ఉంచాలి. పారిశుద్ధ్యం, ఆహారంపై తప్పకుండా ధ్యాస పెట్టాలి. నాణ్యమైన మందులు ఇస్తున్నారా? లేదా? చూడాలి’ అని సీఎం పేర్కొన్నారు.
(చదవండి: కరోనా రావడమన్నది పాపం కాదు: సీఎం జగన్‌)

బెడ్లు నిరాకరించే ధోరణి ఉండకూడదు
‘128 జిల్లా ఆస్పత్రులను మనం గుర్తించాం. 32 వేల బెడ్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ సౌకర్యాలను తప్పనిసరిగా పర్యవేక్షించాలి. 30 నిమిషాల్లో పేషెంట్‌ అడ్మిషన్‌ జరగాలి. రోగి ఎక్కడకు వచ్చినా సరే అతడి ఆరోగ్య పరిస్థితులను డాక్టర్‌ దృష్టిలో ఉంచుకుని ఎక్కడకు పంపాలన్నదానిపై నిర్ణయించాలి. రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లో 8 వేల బెడ్లు ఉన్నాయి. వీటిని క్రిటికల్‌ కేర్‌ కోసం వాడాలి. పేషెంట్ ఆరోగ్యాన్ని బట్టి అర గంటలోగా బెడ్‌ కేటాయించాలి. వీటన్నింటికి కలెక్టర్, జేసీలను తప్పనిసరిగా బాధ్యులను చేస్తా. ఏ ఆస్పత్రి కూడా నిరాకరించే ధోరణి ఉండకూడదు. అలా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం.

కోవిడ్‌ కేర్‌ సెంటర్ల వద్ద, జిల్లా కోవిడ్‌ ఆస్పత్రులవద్ద.. రాష్ట్రస్థాయి కోవిడ్ ‌ఆస్పత్రుల వద్ద ఫిర్యాదు చేయడానికి.. 1902 నంబర్ ‌డిస్‌ప్లే చేయాలి. ఆస్పత్రి సదుపాయాలపై ఎవరైనా కంప్లైంట్‌ చేస్తే వెంటనే స్పందించాలి. 128 జిల్లా ఆస్పత్రులు, 10 రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లో.. బెడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు డిస్‌ ప్లే చేయాలి. పబ్లిక్‌ డొమైన్‌లో ఈ వివరాలు పెట్టాలి. కేవలం సదుపాయాలే కాదు, అందుబాటులో డాక్టర్లు ఉన్నారా? పారిశుద్ధ్యం బాగుందా? భోజనం బాగుందా? అనే పర్యవేక్షణ జరగాలి. మానవత్వంతో ఈ సమస్యలను పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలి. ఒక బలమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకోవాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఇదే విషయాలను ట్విటర్‌లోనూ సీఎం జగన్‌ పునరుద్ఘాటించారు.
('రైతుభ‌రోసా' కేంద్రాల్లో డిజిటల్ పేమెంట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement