పాత విధానంలోనే పేదింటి సాయం | Chandrababu Naidu Lied About The House Construction Aid Under Housing Scheme, More Details Inside | Sakshi
Sakshi News home page

పాత విధానంలోనే పేదింటి సాయం

Dec 13 2024 5:57 AM | Updated on Dec 13 2024 9:02 AM

Chandrababu Naidu lied about the housing scheme

రూ.4లక్షలు ఇస్తామని నమ్మించి చంద్రబాబు నయవంచన 

గృహ నిర్మాణ శాఖపై తొలి సమీక్షలోనూ ఆర్భాటంగా ప్రకటన  

గత ప్రభుత్వంలో ఇచ్చిన రూ.1.80 లక్షల సాయం సరిపోదని అప్పట్లో గగ్గోలు 

గత ప్రభుత్వంలోని రూ.1.80 లక్షల సాయాన్నే కొనసాగిస్తూ తాజాగా ఉత్తర్వులు   

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు మాటలు కోట­లు దాటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పు­డు ఆయన చేతలు చతికిలబడ్డాయి. అధికారం చేజి­క్కించుకునేందుకు అనేక మాయమాటలు చెప్పి పే­దలను నమ్మించిన ఆయన ఇప్పుడు గద్దెనెక్కాక వంచిస్తున్నారు. ఇందులో భాగంగా.. సొంత గూడు­లేని పేదలను బాబు ప్రభుత్వం దగా చేస్తోంది. గత ప్రభుత్వంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.1.80 లక్షలు ఏమాత్రం సరిపోదని, నిర్మాణ వ్యయం ఇంకా పెంచాలని అప్పట్లో ఆయన గుండెలు బాదుకున్నారు.

తాము అధికారంలోకి వస్తే నిర్మాణ సాయం పెంచుతామని పేదలందరినీ ఊరించారు. మరోవైపు.. గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన తొలి సమీక్షలోనూ పేదల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. మంత్రులు సైతం ఈ అంశాన్ని ఊదరగొట్టారు. ఎల్లోమీడియా సైతం బాబు ప్రభుత్వం నిర్మాణ సాయం పెంచేస్తోందని బాకాలు ఊదాయి. 

సీన్‌ కట్‌ చేస్తే.. ఇప్పుడు అదే రూ.1.80 లక్షల సాయాన్నే పేదల ఇంటి నిర్మాణానికి అందించేలా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, గత ప్రభుత్వంలో అమలుచేసిన మూడు ఆప్షన్ల విధానాన్నీ యథావిధిగా కొనసాగిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ వెలువరించిన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనూ గత ప్రభుత్వంలోని యూనిట్‌ ధరతోనే పథకాన్ని కొనసాగిస్తామని పేర్కొంది.  

ఇసుక ఉచితం అంటూనే ఖరీదు కట్టారు.. 
గత ప్రభుత్వంలో మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 18.01 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచి్చనట్లు వెల్లడించారు. వీటిలో ప్రస్తుతం 6.40 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం రూ.1.50 లక్షల సాయం అందిస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు కలిపి మొత్తం రూ.1.80 లక్షలు గత ప్రభుత్వంలో ఇచ్చారు. ఇదే తరహాలో ప్రస్తుతం కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇక గత ప్రభుత్వం నుంచే 20 మెట్రిక్‌ టన్నుల ఇసుకను ఇంటి నిర్మాణానికి సరఫరా చేస్తున్నారు. కానీ, ఇసుకను ఉచితం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం, పేదల ఇంటికి అందించే 20 మెట్రిక్‌ టన్నుల ఇసుకకు రూ.15 వేలు ఖరీదు కట్టింది. 

గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసి, వారు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించేది. కానీ, ఇప్పుడేమో ఇసుక ఉచితం అని చెబుతూనే రూ.15 వేలు వెలకట్టి, ఆ మేర మేలు చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకోవాలని చూస్తోందని లబి్ధదారులు ఆరోపిస్తున్నారు.  

రూ.4 లక్షల ఊసేలేదు.. 
పేదల ఇంటి నిర్మాణాలపై ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో ఎక్కడా రూ.4 లక్షలకు సాయం పెంపు ఊసేలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన రూ.1.80 లక్షల సాయాన్నే యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించడంపై పేదలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

సాయం పెంచుతున్నట్లు సీఎం ప్రకటించడంతో సొంతింటి నిర్మాణానికి అదనపు చేయూత లభిస్తుందని లబి్ధదారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం సాయం పెంచుతుందని చాలామంది నిర్మాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. కానీ, రూ.1.80 లక్షలకు మించి ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించడంతో పేదల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. 

Advertisement
 
Advertisement
Advertisement