
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న భూముల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది. సీఎం వైఎస్ జగన్ చొరవతో ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేలాది ఎకరాలకు నిషేధిత భూముల నుంచి జాబితా విముక్తి లభించింది. తాజాగా కృష్ణాజిల్లాలో దశాబ్దాల క్రితం ప్రభుత్వానికి నామమాత్రంగా ధర చెల్లించి, కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలకు నిషేధిత భూముల జాబితా నుంచి విముక్తి లభిస్తోంది.
పూర్తి వివరాలు ఇవి..
మచిలీపట్నం, గుడివాడ ప్రాంతంలో కొన్ని లే అవుట్లలో 1970–80 ప్రాంతంలో రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, ఉద్యోగులు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ చెల్లించి స్థలాలు కొనుగోలు చేసి, ఇంటి పట్టాలు పొందారు. అయితే ఈ స్థలాలు నిషేధిత భూముల జాబితాలో ఉండటం వల్ల రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బంది పడుతున్నారు. ఇంటి స్థలాలు పొంది లే అవుట్లలో ఉన్న వారు తమ సమస్యను కలెక్టర్ రాజబాబు దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే ఆయన స్పందించి, విషయాన్ని సీసీఎల్ఏ దృష్టికి తీసుకెళ్లారు. అసైన్డ్ భూములనే రెగ్యులరైజ్ చేస్తున్నామని, కానీ ఇక్కక దశాబ్దాల కిందట మార్కెట్ విలువ చెల్లించి స్థలాలు కొన్నారని, వీటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీసీఎల్ఏ మచిలీపట్నంలోని ఆరు లేఅవుట్లో, గుడివాడలోని ఇంటి స్థలాలను సైతం నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని గత నెల 31వ తేదీ 368 జీవో జారీ చేశారు.
సర్వే ప్రారంభించిన అధికారులు..
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజితాసింగ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, ఇంటి స్థలాలు ఎన్ని ఉన్నాయో సర్వే చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సర్వే బృందాలు ఇంటి స్థలాలను గుర్తిస్తున్నారు. ఈ జీవో ప్రకారం 2వేల కుటుంబాలకు పైగా లబ్ధి కలుగుతుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి, నిషేధిత భూముల జాబితా నుంచి విముక్తి చేసే దిశగా రెవెన్యూ శాఖ అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ప్రధానంగా ఈ జీవో ప్రకారం మచిలీపట్నం, గుడివాడలో అప్పట్లో ఇంటి స్థలాలు పొందిన రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు లబ్ధి కలుగనుంది.
వేగంగా భూములకు పరిష్కారం..
ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే 60 ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్నా గన్నవరం నియోజకవర్గంలోని వెంకటాపురం ఇనాం భూములకు సైతం జిల్లా కలెక్టర్ నిషేధిత భూముల జాబితా నుంచి విముక్తి కల్పించారు. దీని ద్వారా వేలాది మంది పేద రైతులకు లబ్ధి కలిగింది. అలాగే గత ఏడాది అక్టోబర్లో అవనిగడ్డలో షరతుగల పట్టా భూములను నిషేధిత భూముల నుంచి తొలగించారు. దీని ద్వారా ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలోనే 15,791 ఎకరాలు, 10,119 మంది రైతులకు లబ్ధి కలిగింది.
చిక్కుముడులు తొలగిస్తున్నాం..
ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఇందులో భాగంగా అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు యజమాన్యపు హక్కులు కల్పిస్తున్నాం. ఇటీవల వెంకటాపురం గ్రామంలోని ఇనాం భూముల సమస్య పరిష్కరించాం.
ఇప్పుడు నామమాత్రపు మార్కెట్ విలువ చెల్లించి, ఇంటి స్థలాలు కొనుగోలు వాటిని నిషేధిత స్థలాల జాబితా నుంచి తొలగించేలా ప్రభుత్వం 368 జీవో జారీ చేసింది. ఈ మేరకు జేసీ ఆధ్వర్యంలో ఇంటి స్థలాల సర్వే సాగుతోంది. దీని ద్వారా 2వేలకుపైగా కుటుంబాలకు లబ్ధి కలుగనుంది. – రాజబాబు, కలెక్టర్, కృష్ణా