సాక్షి,కృష్ణా: 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే సత్తా కూటమి ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. దొంగ వాగ్ధానాలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జొన్నపాడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో కొడాలి నాని వ్యాఖ్యానించారు
‘వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పరని ప్రజలకి తెలుసు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. సూపర్-6 అంటూ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. దొంగ వాగ్ధానాలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వైఎస్ జగన్ అన్ని హామీలను అమలు చేశారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని చెబుతారు. 2029లో వైఎస్ జగన్ను ప్రజలు గెలిపిస్తారు.
ఏపీ ప్రజలకు వైఎస్ జగన్ విలువ తెలిసింది. జగన్ను వదులుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. జగన్ ఉంటేనే తమకు మంచి జరుగుతుందని పేదలు భావిస్తున్నారు. జగన్ను సీఎం కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదు. కావాలనే వైఎస్ జగన్పై నిందలు మోపుతున్నారు. తండ్రి చనిపోతే తండ్రి ఆస్తిలో వాటాలు ఇచ్చే వారిని చూశాం. తన సొంత ఆస్తిలో కూడా వాటాలు ఇచ్చిన వ్యక్తి జగన్. వైఎస్ జగన్పై దారుణంగా మాట్లాడుతున్నారు. జగన్ ఎప్పుడూ చెల్లెళ్ల గురించి తప్పుగా మాట్లాడలేదు. లడ్డూ విషయంలో దేవుడు కూటమికి మొట్టికాయలు వేశాడు’అని వ్యాఖ్యానించారు.



