● జిల్లావ్యాప్తంగా పోలీసుస్టేషన్లలో వైఎస్సార్ సీపీ శ్రేణుల ఫిర్యాదు
పార్టీ శ్రేణులతో కలిసి గుంతకల్లులో సీఐ మనోహర్కు ఫిర్యాదు చేస్తున్న
వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి
రాప్తాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
అనంతపురం: మహిళలను కించపరిచేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలకు బాధ్యుడిని చేస్తూ ఏబీ ఎన్ ఎండీ రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ‘రాధాకృష్ణది జర్నలిజం కాదు.. బ్రోకరిజం’ అంటూ దుయ్యబట్టారు.
రాధాకృష్ణ జర్నలిజం విలువలను విస్మరించి, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాప్తాడు పోలీసుస్టేషన్లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు.
ఏబీఎన్ రాధాకృష్ణ తన కొత్తపలుకు శీర్షికతో వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులను,మహిళలను నీచమైన, నికృష్టమైన భాషతో దూషించడాన్ని ఖండిస్తూ వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో అనంతపురంలో నిరసన తెలిపారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పార్టీ లీగల్సెల్ జిల్లా అధ్యక్షుడు గాజుల ఉమాపతి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న, లీగల్ సెల్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రాముడు, నారాయణ రెడ్డి, హబీబుల్లా, పురుషోత్తం, శైలజాబాను, కవిత, అరుణ, చంద్రా రెడ్డి, మల్లికార్జున, లక్ష్మీకాంత్, జీఎల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం రూరల్ మండలం ఇటుకలపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు పి. హేమంత్కుమార్, శివ, సురేష్, భరత్, వీర, మహానంది, అరవింద్, శ్రీనివాసులు, అర్జున్ పాల్గొన్నారు.
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లులో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గుంతకల్లు డీఎస్పీ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేసేంతవరకు ఆందోళనలు విరమించేది లేదని నైరుతి రెడ్డి స్పష్టం చేశారు.
రాధాకృష్ణ బాధ్యాతారాహిత్య జర్నలిజాన్ని శింగనమల, ఉరవకొండలో వైఎస్సార్ సీపీ నాయకులు ఖండించారు. ఏబీఎన్ రాధాకృష్ణపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు.


