
అర్హులందరికీ ‘అన్నదాత సుఖీభవ’
● ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
కూడేరు: అర్హులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ అందుతుందని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. శనివారం కూడేరులోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ లలితమ్మ అధ్యక్షతన నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2,75,642 మంది రైతు కుటుంబాలకు రూ.192.95 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.137.82 కోట్లు, ‘పీఎం కిసాన్’ కింద రూ.55.13 కోట్ల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానుందన్నారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కూడా లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కూడేరు మండలంలో 9,454 మంది రైతు కుటుంబాలకు రూ.6.62 కోట్లకు సంబందించి మెగా చెక్ అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారిణి ఉమామహేశ్వరమ్మ, ఏడీ అల్తాఫ్ బాషా, తహసీల్దార్ మహబూబ్ బాషా, ఏఓ శుభకర్ రైతులు పాల్గొన్నారు.
మత్తు బిస్కెట్ల పట్టివేత
అనంతపురం సిటీ: రైల్లో తరలిస్తున్న మత్తు బిస్కెట్లను పోలీసులు పట్టివేశారు. ఒడిశా నుంచి బెంగళూరుకు రైళ్లలో నిషేధిత పదార్థాలు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో అనంతపురం పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒడిశా నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు అనంతపురం రైల్వే స్టేషన్ చేరుకోగానే జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ సెల్, మూడో పట్టణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన అశోక్కుమార్ సాల్మన్ అనే ప్రయాణి కుడి బ్యాగును తనిఖీ చేయగా.. అందులో మత్తు పదార్థాలు కలిగిన 210 బిస్కెట్లు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
‘ఉద్యాన’ ప్రోత్సాహకాలపై
దృష్టి సారించండి
అనంతపురం అగ్రికల్చర్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఉద్యాన పథకాల ఫలాలు, ప్రోత్సాహక రాయితీలు పూర్తిస్థాయిలో రైతులకు అందించడంపై దృష్టి సారించాలని ఉద్యాన శాఖ డీడీ డి.ఉమాదేవి ఆదేశించారు. శనివారం నగరంలోని ఉద్యానశాఖ కార్యాలయంలో ఏడీ దేవానంద్కుమార్తో కలిసి హార్టికల్చర్ ఆఫీసర్స్ (హెచ్ఓ)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంఐడీహెచ్, ఆర్కేవీవై, ఆయిల్పామ్, బ్యాంబూ మిషన్ కార్యక్రమాల కింద వివిధ పథకాల అమలుకు రూ.12.86 కోట్ల బడ్జెట్ కేటాయించారన్నారు. కొత్త తోటల విస్తరణ, పాత తోటల పునరుద్ధరణ, యాంత్రీకరణ, పోస్ట్ హార్వెస్టింగ్, ఫారంపాండ్లు, ప్యాక్హౌస్, పాలీహౌస్, కోల్డ్ రూం, కోల్డ్ స్టోరేజీ, సోలార్ డ్రయ్యర్స్, రైపనింగ్ చాంబర్స్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్ తదితర అన్ని రకాల పథకాల అమలుకు అవకాశం ఉందన్నారు. ప్రధానంగా ప్యాక్ హౌస్లకు రూ.2 లక్షల రాయితీ ఉంటుందన్నారు. అలాగే వ్యక్తిగత ఫారంపాండ్లకు రూ.75 వేలు, కమ్యూనిటీ ఫారంపాండ్ల నిర్మాణానికి రూ.18 లక్షలు, సోలార్ కోల్డ్ రూంలకు రూ.4.38 లక్షలు, రైపనింగ్ చాంబర్స్కు రూ.21 లక్షలు, కోల్డ్రూంలకు రూ. 5.25 లక్షలు, సోలార్ డ్రయ్యర్స్కు రూ.లక్ష ఇలా... రాయితీలు రైతులు సద్వినియోగం చేసుకునేలా, పూర్తి స్థాయి బడ్జెట్ ఖర్చు చేయడానికి ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ–క్రాప్ నమోదు ఖచ్చితంగా జరిగేలా పర్యవేక్షణ కొనసాగించాలన్నారు.

అర్హులందరికీ ‘అన్నదాత సుఖీభవ’

అర్హులందరికీ ‘అన్నదాత సుఖీభవ’