మీరు కూడా రప్పా..రప్పా అంటే ఎలా? | - | Sakshi
Sakshi News home page

మీరు కూడా రప్పా..రప్పా అంటే ఎలా?

Jun 22 2025 4:06 AM | Updated on Jun 22 2025 4:06 AM

మీరు కూడా రప్పా..రప్పా అంటే ఎలా?

మీరు కూడా రప్పా..రప్పా అంటే ఎలా?

అనంతపురం కార్పొరేషన్‌: ‘సీఎం చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ భయం పట్టుకుంది. అందుకే రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పేరుతో దుష్ట సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం తీసిపోకుండా కొందరు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం సృష్టించేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా రప్పా.. రప్పా అంటే ఎలా.. వైఎస్సార్‌ సీపీ శ్రేణులను బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన జయరామ్‌కు ప్రజలే తోక కట్‌ చేసి సున్నం పెడతారు’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం నగరంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తల నరకాలంటూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడడం దారుణమన్నారు. సినిమా డైలాగ్‌ను ఎవరో ప్లకార్డుపై ప్రదర్శిస్తే దానికి విపరీత అర్థాలు తీసుకువస్తున్నారన్నారు. రెడ్‌ బుక్‌ పేరుతో వైఎస్సార్‌ సీపీ నాయకులను జైల్లో ఉంచి, ఆరోగ్యం క్షీణిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, సుప్రీంకోర్టు, హైకోర్టు అక్షింతలు వేసినా ప్రభుత్వంలో మార్పు రావడం లేదన్నారు.

జయరామ్‌ ఎక్కడికి

కాకుండా పోతావ్‌..

ఏడాది పాలనలో ప్రజలకు ఏమీ చేయకపోవడంతో ‘కూటమి’పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అనంత పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ నుంచి ఎవరూ పోటీ చేయకూడదని, సరెండర్‌ కావాలని, లేకపోతే తోలుతీస్తాం, తాట తీస్తామని గుంతకల్లు ఎమ్మెల్యే జయరామ్‌ అంటున్నారని, ఇవన్నీ చూస్తూ ఇక్కడి ప్రజలు ఊరుకోరన్నారు. ఇటీవల విలేకరులను రైలు పట్టాలపై పడుకోబెడతానని బెదిరించారని, జయరామ్‌ నోటికి అదుపు లేదా అని ధ్వజమెత్తారు. గుంత కల్లు, గుత్తి, పామిడి మండలాల్లో షాడో ఎమ్మెల్యేలను పెట్టి ఇసుక దోపిడీ చేస్తున్నారన్నారు. గుంతకల్లులో పేకాట, మట్కా విచ్చలవిడిగా సాగుతోంద న్నారు. జిల్లా ప్రజలను తక్కువగా అంచనా వేస్తే ఎక్కడికి కాకుండా పోతారని హెచ్చరించారు. గుమ్మనూరు వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

పరిటాల చరిత్ర తెలియదా:

పరిటాల రాజకీయ ఎంట్రీ ఎలా జరిగిందో అందరికీ తెల్సిందేనని అనంత తెలిపారు. ఇవాళ ఆ కుటుంబం కూడా రప్పా..రప్పా అంటూ మాట్లాడి మరీ ఘోరంగా తయారవుతోందన్నారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని కూటమి ప్రజాప్రతినిధులు చూస్తున్నారని, ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికలకు వైఎస్సార్‌ సీపీ సిద్ధంగా ఉందన్నారు. టీడీపీకి భవిష్యత్తు లేకుండా ప్రజలు సున్నం పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఓ సంస్థ ఇటీవల సర్వే నిర్వహిస్తే అందులో 53 మంది ఎమ్మెల్యేలు రెడ్‌జోన్‌లో ఉన్నారని, అందులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌ ఒకరని అనంత పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర శేఖర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌ రెడ్డి, అధికార ప్రతినిధి మారుతీ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్‌, నగరాధ్యక్షుడు శ్రీనివా స్‌దత్తా, ఉపాధ్యక్షుడు ఉదయ్‌, ప్రధాన కార్యదర్శి హిదాయతుల్లా పాల్గొన్నారు.

పరిటాల సునీత వ్యాఖ్యలపై వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ఆగ్రహం

జయరామ్‌కు ప్రజలే తోక కట్‌ చేసి సున్నం పెడతారని హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement