
జయరామ్.. నోరు అదుపులో పెట్టుకో
గుంతకల్లుటౌన్: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకులు నామినేషన్ వేయకుండా చేస్తానంటూ జయరామ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైవీఆర్ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు.ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే అమలు కావాలన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం ఇక్కడ చెల్లుబాటు కాదన్నారు. వ్యతిరేక వార్తలు రాసే పాత్రికేయులను పట్టాలపై పడుకోబెడతానని బెదిరించినట్లు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే సహించబోమన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవ్వరూ లేరన్నారు. జయరామ్ దౌర్జన్యాల నుంచి తమ పార్టీ కార్యకర్తలు, గుంతకల్లు నియోజ కవర్గ ప్రజలను కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్ధమని స్పష్టం చేశారు. జయరామ్కు ఎలా సమాధానం చెప్పాలో బాగా తెలుసునన్నారు. రాజకీయంగా ప్రాణం పోసి మంత్రి పదవిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినే వెన్నుపోటు పొడిచారని, వెన్నుపోటులో చంద్రబాబును మించిపోయారని ఎద్దేవా చేశారు. పేకాట, లిక్కర్, ఇసుక స్కామ్లకు పెద్ద ఎత్తున పాల్పడుతున్నారని టీడీపీ అనుకూల పత్రికలు, ఎల్లో మీడియాలోనే జయరామ్పై కథనాలు ప్రసారమవుతున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ అధిష్టానం జయరామ్కెప్పుడో రెడ్మార్క్ వేసిందన్నారు. ఇతడి ప్రవర్తన, దౌర్జన్యాలతో టీడీపీ శ్రేణులంతా విసిగిపో యారన్నారు. జయరామ్కు ధైర్యముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, తన నామినేషన్ను అడ్డుకోగలిగితే రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని వైవీఆర్ సవాల్ విసిరారు. మోసపూరిత హామీలు, ఈవీఎంల పుణ్యంతో గెలిచిన జయరామ్ ఇకనైనా దౌర్జన్యాలు చేయడం మానుకుని ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు.
వెన్నుపోటులో చంద్రబాబును మించిపోయావ్
మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ ధ్వజం
ధైర్యముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్