
రచ్చ చేస్తాం.. రెచ్చిపోతాం
● అనంతపురంలో ఆగని దౌర్జన్యాలు ● ఒక్క కేసు నమోదు చేస్తే ఒట్టు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గం భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు, దాడులతో అట్టుడుకుతోంది. ఏ రోజు ఎలాంటి గొడవలు జరుగుతాయో, ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొని ఉంది. స్థానిక ప్రజాప్రతినిధి దెబ్బకు సొంతపార్టీలోని వారే కంగుతింటున్నారు. టీడీపీలోనే రెండు గ్రూపులు కావడంతో ఏ గ్రూపు నుంచి ఎవరికి ఎటు నుంచి ముప్పు వస్తుందో తెలియడం లేదు.
రోజూ ఎక్కడో ఒక చోట భూ ఆక్రమణలు : నగరంలో ఖరీదైన ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు ప్రజాప్రతినిధి అనుచరులు కబ్జాలకు యత్నిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కియా షోరూం వెనకాల సుమారు 90 సెంట్ల ఖాళీ స్థలంపై కొందరి కన్ను పడింది. భూమి యజమానిపై దాడిచేశారు. ఓనర్లు తీవ్ర గాయాలతో కర్నూలు ఆస్పత్రిలో చేరారు. దీనిపై నాల్గో పట్టణ పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. అంతకు ముందు కూడా ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఖాళీ స్థలాల కోసం యత్నించి విఫలమైనట్టు తెలుస్తోంది.
హోటళ్లు..బార్లపై దాడులు : ప్రజాప్రతినిధిని.. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాలో ఉన్నట్లు తెలిసింది. అందుకే తనకు ఒకరోజు రూము ఇవ్వలేదని అలెగ్జాండర్ హోటల్పై దాడి చేశారు. ఆ ఘటన మరువకముందే యువరాజ్ బార్ పై దాడికి దిగారు. బార్లో హార్డ్డిస్క్లు తీసుకెళ్లినట్టు బాధితులు చెప్పారు. స్వయానా టీడీపీ అనుకూల పత్రికల్లో దీనిపై వార్తలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రూపులతో రచ్చ.. : అనంతపురం అర్బన్ నియోజకవర్గ రాజకీయం రచ్చకెక్కింది. 2024 ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వని కారణంగా వేరుకుంపటి పెట్టారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు, ప్రభాకర్ చౌదరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీనికితోడు తాజాగా టీడీపీ నేత సుధాకర్ నాయుడు ఎమ్మెల్యేతో విభేదించారు. ఈ క్రమంలో అర్బన్ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు రోజు రోజుకూ పెచ్చుమీరి పరిస్థితి చేయిదాటిపోయింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నగరం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్గా మారింది. ఒకరకంగా చెప్పాలంటే గ్రూపు రాజకీయాలతో అల్లకల్లోలంగా తయారైందని కొందరు టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు.
జేఎల్ఎంకు విద్యుత్ షాక్
బెళుగుప్ప: మండలంలోని గంగవరం గ్రామ సమీపంలో సోమవారం విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తూ జేఎల్ఎం నారాయణస్వామి షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఓ రైతు తోటలో ట్రాన్స్ఫార్మర్ వద్ద సోమవారం మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సబ్ స్టేషన్లో ఎల్సీ తీసుకుని ఫోన్లో మాట్లాడుతూనే స్తంభం పైకి ఎక్కాడు. అయితే విద్యుత్ లైన్కు మరో ఫీడర్ లైన్ క్రాస్ చేసి ఉండడంతో స్పార్క్ ఉత్పన్నమై షాక్కు గురయ్యాడు. ఎడమ చేతికి, మెడకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన రైతులు తొలుత కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు ఏఈ గంగాధర్ తెలిపారు.
ఆస్పత్రిలో టీకా లేదు – పౌష్టికాహారం ఇవ్వరు
● కలెక్టర్ వినోద్ కుమార్ వద్ద గోడు వెల్లబోసుకున్న గర్భిణి
తాడిపత్రి రూరల్: దివ్యాంగురాలైన తాను ఐదు నెలల గర్భంతో ఉన్నానని, ఈ సమయంలో కీలకంగా అందజేసే టీకాలు కానీ, పౌష్టికాహారం కాని తనకు అందడం లేదంటూ కలెక్టర్ ఎదుట ఓ గర్భిణి వాపోయారు. ఈ మేరకు సోమవారం యాడికిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ను కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో బాధితురాలు మాట్లాడారు. వైఎస్సార్ జిల్లా కడప నగరంలో నివాసముంటున్న నీరజ.. తన తల్లిదండ్రులు చనిపోవడంతో కొన్నేళ్ల క్రితం సజ్జలదిన్నెలోని అమ్మమ్మ ఇంటికి వచ్చేశారు. కూలి పనులతో జీవనం సాగిస్తుండేది. ఈ క్రమంలో పని ప్రాంతంలో రోడ్డు దాటుతున్న సమయంలో లారీ ఢీకొనడంతో తన కుడి చేతిని కోల్పోయింది. కోలుకున్న అనంతరం ఓ ఉద్యోగికి ఇచ్చి వివాహం జరిపించగా కొన్ని రోజులకే సదరు ఉద్యోగికి తాను రెండో భార్యగా గుర్తించిన నీరజ తప్పని పరిస్థితుల్లో సర్దుకుపోయింది. ప్రకాశం జిల్లాలో బ్యాంకు ఉద్యోగం చేస్తున్నానంటూ భర్త అప్పుడప్పుడు వచ్చి వెళుతుండేవాడు. అంతకు మించి కుటుంబ బాగోగులను ఆయన పట్టించుకునేవాడు కాదు. వీరి దాంపత్య జీవనానికి గుర్తుగా మూడేళ్ల వయసున్న ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆమె 5 నెలల గర్భిణి. గర్భస్థ శిశువు ఆరోగ్యం కోసం తాడిపత్రిలోని ఆస్పత్రికి వెళితే ఆధార్ కార్డు లేకపోవడంతో కనీస టీకాలు కూడా అందలేదు. పౌష్టికాహారం కోసం అంగన్వాడీ కేంద్రానికి వెళితే.. ఆధార్ కార్డు, మాతాశిశు సంరక్షణ కార్డు(ఎంటీసీటీసీ) పుస్తకం ఇవ్వాలంటున్నారు. అవి రెండూ తన వద్ద లేకపోవడంతో తలెత్తిన ఇబ్బందులపై సోమవారం కలెక్టర్కు వివరించి, న్యాయం చేయాలని వేడుకున్నారు.

రచ్చ చేస్తాం.. రెచ్చిపోతాం