
నేడు యాడికిలో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం యాడికి మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. యాడికి మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
యోగాతో మానసికోల్లాసం
తాడిపత్రి రూరల్: యోగాతో మానసికోల్లాసం లభిస్తుందని కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. పట్టణంలోని శ్రీదేవి, భూదేవి సమేత చింతల వెంకటరమణస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన ‘యోగాంధ్ర’లో కలెక్టర్ వినోద్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్కు ఆలయ ప్రధాన అర్చకులు మురళిస్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చరిత్ర, రామాయణ, మహాభారత గ్రంథాల సారాంశంతో కూడిన శిల్పకళను చూసి కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్కు స్వామి వారి వస్త్రం, చిత్రపటాన్ని అర్చకులు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఈబీదేవి, ఆర్డీఓ కేశవనాయుడు, జిల్లా టూరిజం అధికారి జయకుమార్, యోగా గురువు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
18న ‘దిశ’ సమావేశం
అనంతపురం సిటీ: దిశ (జిల్లా సమన్వయ – అభివృద్ధి) కమిటీ సమావేశం ఈ నెల 18న కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఉదయం 11 గంటలకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరగనుంది. గత సమావేశంలో ప్రజాప్రతినిధులు, దిశ కమిటీ సభ్యులు లేవనెత్తిన అంశాలు, వాటికి సంబంధించి తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి దిశ కమిటీ సమావేశాలు నిర్వహించాలని చట్టం చెబుతున్నా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి సమావేశం అక్టోబర్ 29న నిర్వహించారు. ఆ తరువాత సమావేశం నిర్వహణను గాలికి వదిలేశారు. ఎంపీ, కలెక్టర్ ఇద్దరికీ తీరిక లేకపోవడంతో ఈ సమావేశాలు నిర్వహించలేకపోయినట్లుగా సమాచారం. ఇక శ్రీసత్యసాయి జిల్లా విషయానికొస్తే.. డిసెంబర్ 31న పుట్టపర్తి రెవెన్యూ భవన్లో దిశ కమిటీ సమావేశాన్ని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి అధ్యక్షతన నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు.

నేడు యాడికిలో ‘పరిష్కార వేదిక’