
‘పచ్చ’ నేతల అక్కసు
కళ్యాణదుర్గం: టీడీపీ నేతలు ఆర్డీటీపై కూడా తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్ర శనివారం రాత్రి బాల వెంకటాపురం గ్రామానికి చేరుకుంది. ఈ క్రమంలో కార్యక్రమాన్ని అడ్డుకోవాలని టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నారు. గ్రామంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య బస చేస్తున్న ప్రాంతానికి సమీపంలోనే నీచ రాజకీయాలకు తెర లేపారు. ‘తల్లికి వందనం’ లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేపడుతున్నట్లు హడావుడి చేశారు. రాత్రికి రాత్రే గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
మొదటి నుంచీ అంతే..
ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ కోసం మాజీ ఎంపీ తలారి రంగయ్య చేస్తున్న పాదయాత్రను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుయుక్తులకు తెరతీశారు. పాదయాత్ర ప్రారంభంలో గొంచి తండాలో తలారి రంగయ్యను పోలీసులతో అరెస్టు చేయించాలని శతవిధాలా ప్రయత్నించారు. అయితే అక్కడ ప్రజలు చైతన్యవంతులై పాదయాత్రకు రక్షణగా నిలవడంతో వారి ఆటలు సాగలేదు. ఆ తర్వాత బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో పాదయాత్రను అడ్డుకునేందుకు ఏకంగా ‘పచ్చ మూకలు’ రోడ్డుపై బైఠాయించాయి. ఏ మాత్రం బెదరని రంగయ్య ఆర్డీటీ కోసం సడలని సంకల్పంతో ముందుకువెళ్లడంతో తోకముడిచారు.తాజాగా బాల వెంకటాపురం గ్రామంలో కుట్రలకు తెరతీయడం గమనార్హం.
భారీగా పోలీసు బందోబస్తు..
రంగయ్య పాదయాత్రను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలుసుకున్న పోలీసులు గ్రామంలో బందోబస్తు చేపట్టారు. డీఎస్పీ రవిబాబు, సీఐలు వంశీకృష్ణ, నీలకంఠేశ్వరలతో పాటు పదుల సంఖ్యలో పోలీసులు పహారా కాశారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ రంగయ్య పాదయాత్ర షెడ్యూల్ ఉదయం 10 గంటలకు ఉన్నా టీడీపీ నేతల ఒత్తిళ్లతో రంగయ్యను ఉదయం 8 గంటలకే బస చేసే ప్రాంతం నుంచి బయలుదేరాలని కోరారు. ఆర్డీటీ కోసం చేస్తున్న పాదయాత్రను కూడా ఓర్చలేకపోవడంపై రంగయ్య అసహనం వ్యక్తం చేశారు. పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు పన్నడం సరికాదని పలువురు మహిళలు హితవు పలికారు.