
ఆర్డీటీని పరిరక్షించుకుందాం
కళ్యాణదుర్గం: ఆర్డీటీ పరిరక్షణకు మాజీ ఎంపీ తలారి రంగయ్యతో కలిసి నడుద్దామని పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీడబ్ల్యూసీ సభ్యుడు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి పిలుపు నిచ్చారు. వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ, పార్టీ పీఏసీ సభ్యులు డాక్టర్ తలారి రంగయ్య చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రకు ఆదివారం కళ్యాణదుర్గం మండలం బాలవెంకటాపురం గ్రామంలో రఘువీరారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క బాల వెంకటాపురం గ్రామంలోనే 70 కుటుంబాలు ఆర్డీటీ ద్వారా లబ్ధి పొందాయన్నారు. 40 ఇళ్లు ఆర్డీటీ నిర్మించిందన్నారు. ఆర్డీటీని కాపాడటం కోసం పాదయాత్ర చేయాల్సి వస్తుందని తలారి రంగయ్య ముందే చెప్పారని గుర్తు చేసుకున్నారు. పేద ప్రజలకు ఆర్డీటీ ఫలాలు ఆగకూడదన్నారు. ప్రభుత్వాలు కూడా చేయలేని ఎన్నో పనులను ఆర్డీటీ చేసిందన్నారు. ఆర్డీటీ అంశాన్ని ఎవరూ రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్డీటీ ఆసుపత్రులు మూతపడితే పేదలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. తలారి రంగయ్య పాదయాత్ర 220 కిలోమీటర్ల మేర జరుగుతుందని, ఇది ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేపట్టిన కార్యక్రమమని చెప్పారు. ఆర్డీటీ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందింది కళ్యాణదుర్గం నియోజకవర్గ వాసులేనన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రంగయ్య పాదయాత్ర నిర్ణయం తీసుకున్నారని, ఆయన సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు. పాదయాత్రకు రాజకీయాలకు అతీతంగా నాయకులు, ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. ఆర్డీటీ విషయమై త్వరలోనే ఢిల్లీకి వెళ్తానని, ప్రధాన మంత్రితో పాటు కేంద్ర హోంమంత్రిని పార్టీ పెద్దలతో కలిసి కలుస్తానని ఆయన పేర్కొన్నారు. అనంతరం తన స్వగ్రామం నీలకంఠా పురంలోని ఆలయాల్లో పూజలు చేయించిన పట్టువస్త్రంతో పాటు ప్రసాదాలను తలారి రంగయ్యకు అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి
తలారి రంగయ్య ఆర్డీటీ పరిరక్షణ
పాదయాత్రకు సంఘీభావం

ఆర్డీటీని పరిరక్షించుకుందాం