హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటాలు ఆగవు | - | Sakshi
Sakshi News home page

హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటాలు ఆగవు

Jun 16 2025 5:37 AM | Updated on Jun 16 2025 5:37 AM

హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటాలు ఆగవు

హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటాలు ఆగవు

అనంతపురం కార్పొరేషన్‌: ‘అలవిగాని హమీలతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. ప్రజల పక్షాన నిలబడతాం. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే వరకు పోరాటాలు ఆగవు. ప్రభుత్వ మెడలు వంచైనా పథకాలు అమలు చేసేలా ఒత్తిడి తీసుకువస్తాం’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆదివారం వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ‘జగన్‌ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు తావివ్వ కుండా ప్రజలకు రూ.2.81 లక్షల కోట్లు అందించారన్నారు. ఏడాది బాబు పాలనలో కేవలం సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా రూ.81 వేల కోట్లు ప్రజలకు ఇవ్వాల్సి ఉందని, ఆ బాకీ తీర్చే వరకు తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో పోరాటాలు చేస్తామన్నారు. 2014–19లోనూ ప్రజలను బాబు వంచించారన్నారు. వైఎస్సార్‌ సీపీ పోరాటాలు చేయడంతోనే ‘తల్లికి వందనం’ నిధులు విడుదల చేశారన్నారు. రాష్ట్రంలో 67 లక్షల మంది అర్హులుంటే అందులో 37.70 లక్షల మందికే పథకం వర్తింపజేశారని, మిగిలిన వారికీ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. గత వైఎస్సార్‌ ప్రభుత్వంలో ‘అమ్మ ఒడి’ నిధుల నుంచి రూ.2 వేల చొప్పున పాఠశాల అభివృద్ధికి కేటాయిస్తే జే ట్యాక్స్‌ అంటూ దుష్ప్రచారం చేసిన చంద్రబాబు అండ్‌ కో... ఇవాళ అదే పద్ధతిలో రూ.13,000 మాత్రమే ఇస్తోందని దుయ్యబట్టారు. ‘అన్నదాత సుఖీభవ’, ‘ఆడబిడ్డ నిధి’, ‘ఉచిత బస్సు ప్రయాణం’ అమలు చేయకుండా జాప్యం చేయడం దారుణమన్నారు.

ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే దోపిడీ..

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజక వర్గాల్లో పోలీసులు, రెవెన్యూ శాఖ ప్రేక్షకపాత్ర పోషించడంతో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో మద్యం, ఇసుక, మట్టి దోపిడీ యథేచ్ఛగా జరుగు తోందని ‘అనంత’ విమర్శించారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనంతపురంలో మద్యం షాపులు, బార్లు, లాడ్జీల్లోకి వెళ్లి దౌర్జన్యం చేసే దారుణమైన పరిస్థితుల్లో పాలకులు ఉన్నారన్నారు. మద్యం షాపుల్లో ఎంఆర్‌పీ కంటే అధికంగా విక్రయించుకోవాలని, ప్రతి నెలా తమకు ఒక్కో షాపు నుంచి రూ.70,000 ఇవ్వాలని ప్రజాప్రతినిధులే డీల్‌ చేసుకున్నారని ధ్వజమెత్తారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే పేదలను సంత మార్కెట్‌ పేరుతో పీల్చిపిప్పిచేస్తున్నారన్నారు. రూ.10 రుసుం వసూలు చేసే చోట రూ.20 నుంచి రూ.40, రూ.50, రూ.100 దండుకుంటూ దోపిడీ చేస్తున్నారన్నారు. నగరపాలక సంస్థకు కేవలం రూ.5 లక్షలు చెల్లిస్తూ..ప్రతి నెలా రూ.లక్షల్లో లాగేసుకుంటున్నారన్నారు. మార్కెట్‌ యార్డులోనూ ఇదే తరహా దోపిడీ జరుగుతోందన్నారు. ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్‌, పార్టీ జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ సభ్యులు రమేష్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి,అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌ నాయక్‌, మల్లెమీద నరసింహులు, చంద్రశేఖర్‌ యాదవ్‌, సైఫుల్లాబేగ్‌, శ్రీదేవి, ఓబిరెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి, చింతా సోమశేఖర్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌ రెడ్డి, అధికార ప్రతినిధి మారుతీనాయుడు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వర్థ్‌నాయక్‌, నాయకులు వెన్నం శివరామిరెడ్డి, గోయింద్‌ నాయక్‌, కొర్రపాడు హుస్సేన్‌ పీరా, రాజారత్నం, రంగారెడ్డి, మీసాల రంగన్న, తనీష, దాదు, దత్తా, అనిల్‌కుమార్‌ గౌడ్‌, పెన్నోబులేసు, చామలూరు రాజగోపాల్‌, కేశవరెడ్డి, కృష్ణవేణి,హరిత,సాకే చంద్రలేఖ,దేవి,విజయశాంతి, భారతి, ఉష, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఏడాదిలో రూ.81 వేల కోట్లు

ప్రజలకు బాకీ పడిన చంద్రబాబు

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత

‘జగన్‌ అంటే నమ్మకం,

బాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement