
వందేళ్ల తర్వాత ఊరి దేవర
బొమ్మనహాళ్: దాదాపు వందేళ్ల తర్వాత బొమ్మనహాళ్లో ఊరి దేవర నిర్వహిస్తుండడంతో గ్రామంలో సందడి నెలకొంది. పాడి పంటలు వెల్లివిరాయలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు ఊరి దేవర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ దేవత దేవమ్మ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఊరి దేవర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గంగపూజ, గోపూజ, 108 కలశాలతో అమ్మవారి విగ్రహానికి అభిషేకం, పడి బియ్యం సమర్పణ, ఆకు పూజ, దుర్గా హోమం ఉంటాయి. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మేటి కుంభాల ఊరేగింపు ఉంటుంది. 22న బుధవారం వేకువజాము 2.30 గంటల మధ్య దేవర పోతును బలి ఇవ్వనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఇళ్ల వద్ద విందు కార్యక్రమాలు ఉంటాయి. కాగా, ఊరి దేవర ఉసందర్భంగా ట్రాఫిక్ సమస్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. నేమకల్లు క్రాస్ వద్ద ట్రాఫిక్ను మళ్లించామన్నారు. బళ్లారి నుంచి కళ్యాణదుర్గానికి వెళ్లే భారీ వాహనాలు డి.హీరేహాళ్, రాయదుర్గం మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకున్నామన్నారు.
బొమ్మనహాళ్లో నేటి నుంచి నిర్వహణ