
అనుమతులున్నా తాడిపత్రికి పంపరా?
యల్లనూరు: హైకోర్టు అనుమతులు ఉన్నా తనను తాడిపత్రికి ఎందుకు పంపరని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన తాడిపత్రికి బయల్దేరగా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, నలుగురు సీఐలు, 80 మంది పోలీసు సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. పెద్దారెడ్డి తిమ్మంపల్లి దాటి పోకుండా పోలీసు జీపులు, బస్సులను రోడ్లకు అడ్డంగా పెట్టారు. మాజీ ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో పెద్దారెడ్డి మాట్లాడుతూ తాను తాడిపత్రికి బయలుదేరానని తెలియగానే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి, పోలీసులు ఏదో ఒక సమస్యను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ‘వైజాగ్కు ప్రధానమంత్రి వస్తున్నారు.. ఇక్కడి నుంచి మేం పోలీసు సిబ్బందిని పంపించాల్సి ఉంది. ప్రధాని పర్యటన ముగిశాక మిమ్మల్ని పంపుతాం’ అని ఎస్పీ జగదీష్ అంటున్నారన్నారు. జేసీ ప్రభాకర్రెడ్డి పోలీసులను అడ్డు పెట్టుకొని నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన చెప్పినట్టల్లా పోలీసులు నడుచుకుంటున్నారన్నారు. 20 రోజుల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసుస్టేషన్లకు పిలిచి హెచ్చరికలు జారీ చేస్తున్నారన్నారు. ‘గ్రామాల్లో ఉండొద్దు.. టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తారు’ అని చెబుతున్నారని ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డి అప్పుడప్పుడు తాడిపత్రికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని, తనను చూసి భయపడి పోలీసులను ఆశ్రయిస్తున్నారన్నారు. ఆయన నాటకాలు తాడిపత్రివాసులందరికీ తెలుసునన్నారు. అనుచరులను కెమెరాల ముందు కూర్చోబెట్టి తన గురించి నీచంగా మాట్లాడిస్తున్నారన్నారు. ఏఎస్పీ స్థాయి అధికారి తాడిపత్రికి వచ్చారంటే ప్రజలెంతో సంతోషించారని, కానీ కొన్నాళ్లకే వారి ఆశలన్నీ ఆవిరైపోయాయన్నారు. పట్టణంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు. మట్కా, పేకాట, గంజాయి విచ్చలవిడిగా సాగుతున్నాయన్నారు. ప్రభాకర్ రెడ్డికి వయసు పైపడిందని, ఇప్పటికై నా కక్షలు కార్పణ్యాలు ఆపి అభివృద్ధిపై దృష్టి సారించా లని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గొడ్డుమర్రి ఈశ్వర్రెడ్డి, దంతలపల్లి బాల వెంకటరెడ్డి, కొత్తపల్లి పురుషోత్తంనాయుడు, గరుగుచింతలపల్లి రామకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ బాస్కర్రెడ్డి, సర్పంచు నారాయణస్వామి, యల్లనూరు కిరణ్, చిలమకూరు జనార్దన్, భాస్కర్, నిట్టూరు రవి, కొండుగారికుంట రామాంజులరెడ్డి పాల్గొన్నారు.
జేసీ, పోలీసుల తీరుపై
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం