
రేపు యాడికిలో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం యాడికి మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. యాడికి మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
నమో నారసింహ
కదిరి టౌన్: ఖాద్రీశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. జ్యేష్టమాసం.. అందునా శనివారం కావడంతో స్వామి దర్శనానికి వేలాదిగా తరలివచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటక నుంచి భారీగా వచ్చిన భక్తులు స్వామి దర్శనం కోసం ఉదయమే బారులు తీరారు. నమో నరసింహ అంటూ వసంతవల్లభుడిని భక్తులు కీర్తించగా.. కదిరి మార్మోగింది. స్వామి కాపులు తలనీలాలు సమర్పించు కున్నారు. సాయంత్రం వేళ మహిళలు దీపాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
మంత్రి సవిత బాధిత
తహసీల్దార్ బదిలీ
పెనుకొండ: తహసీల్దార్ శ్రీధర్...ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి. ఈ నెల 1వ తేదీన పెనుకొండ డ్వాక్రా భవన్ వద్ద మంత్రి సవితకు పూలబొకే ఇవ్వగా...ఆమె దాన్ని వెనక్కు విసిరివేయడం...ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ఆ తర్వాత మంత్రి సవిత తనకు అధికారులంటే గౌరవమంటూ ప్రెస్మీట్ పెట్టి మరీతెలిపినా... తహసీల్దార్ శ్రీధర్పై మాత్రం ఆమె కోపం చల్లారలేదు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం తహసీల్దార్ శ్రీధర్ను పెనుకొండ నుంచి గుడిబండకు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాదిలోపు పదవీ విరమణ చేయనున్న అధికారులకు బదిలీ నుంచి మినహాయించాలన్న నిబంధనలు ఉల్లంఘించి మరీ 6 నెలల్లో పదవీ విరమణ చేయనున్న తహసీల్దార్ను బదిలీ వేశారు. దీని వెనుక మంత్రి సవిత హస్తం ఉన్నట్లు రెవెన్యూ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కేవలం తన మాట వినలేదన్న కారణంతో ఆయనపై కక్షగట్టి బదిలీ వేటు వేయించారని ఉద్యోగులు వాపోతున్నారు.
ఇద్దరు పిల్లలతో
సహా తల్లి అదృశ్యం
గార్లదిన్నె: పెనకచర్లలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైంది. ఎస్ఐ గౌస్ మహమ్మద్బాషా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెనకచర్లకు చెందిన పెన్నోబులేసుకు జంబులదిన్నెకు చెందిన వరలక్ష్మితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల చిన్న కుమార్తె పద్మశ్రీ అనారోగ్యానికి గురికావడంతో బత్తలపల్లి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే కుమార్తె ఆరోగ్యం గురించి పెన్నోబులేసు పట్టించుకునేవాడు కాదు. ఈ విషయమై పదో తేదీన వరలక్ష్మి భర్తతో గొడవపడింది. 11న పెద్దకుమార్తె యోగేశ్వరి, చిన్నకుమార్తె పద్మశ్రీతో కలిసి ఆమె అనంతపురం బస్సు ఎక్కి వెళ్లింది. తర్వాత తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎన్నిచోట్ల వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో శనివారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లీపిల్లల కోసం గాలింపు చేపట్టారు.

రేపు యాడికిలో ‘పరిష్కార వేదిక’

రేపు యాడికిలో ‘పరిష్కార వేదిక’

రేపు యాడికిలో ‘పరిష్కార వేదిక’