నక్కపల్లి : హోంమంత్రి నియోజకవర్గంలో దళితులు, దళిత ఉద్యోగులపై వివక్ష చూపిస్తున్నారని, హెచ్ఎంపై సహోపాధ్యాయుడు కులంపేరుతో దూషిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్, అంబేడ్కర్ భీమసేన జిల్లా నాయకుడు కల్యాణరావు ఆరోపించారు. మంగళవారం నక్కపల్లిలో వారు విలేకర్లతో మాట్లాడారు. వేంపాడు హెచ్ఎం చిరంజీవిపై అదే పాఠశాలలో సహోపాధ్యాయుడిగా పని చేస్తున్న ప్రగడ శివాజీ అనే వ్యక్తి కులం పేరుతో దూషించి వివక్ష చూపిస్తున్నారన్నారు. దాదాపు 9 నెలల నుంచి హెచ్ఎంను సహోపాధ్యాయుడు వేధిస్తున్నాడన్నారు. దీనిపై హెచ్ఎం చిరంజీవి పోలీసులకు, డీఈవో, ఎంఈవోలకు ఫిర్యాదు చేసి, వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు శివాజీపై కేసు నమోదు చేయలేదన్నారు. ఒక యూనియన్ అండతో ఉపాధ్యాయుడు కులంపేరుతో దూషించడం చేస్తున్నారన్నారు. ఇదే ఉపాధ్యాయుడిపై గతంలో ఎస్సీ యువకులపై దాడి చేసిన ఘటనలో అట్రాసిటీ కేసు నమోదైనా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ విషయం హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మంత్రి న్యాయం చేస్తారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయన్నారు. తక్షణమే శివాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. వివక్ష చూపినట్టు రుజువైతే చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు స్పందించకపోతే దళిత సంఘాల తరపున ఆందోళనకు దిగుతామన్నారు. ఈ సమావేశంలో డీహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు శివప్రకాష్, సహాయకార్యదర్సి సుబ్బలక్ష్మి అంబేద్కర్ దళిత సేన జిల్లా కార్యదర్శి గౌతం రాజు, బాధిత హెచ్ఎం చిరంజీవి పాల్గొన్నారు.


