
ముమ్మరంగా గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం
కె.కోటపాడు: మూడు నెలలు దాటిన ప్రతి పశువుకూ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం చేపడుతున్నట్లు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ తెలిపారు. కె.కోటపాడు మండలంలో దాలివలస, సింగన్నదొరపాలెం, కె.కోటపాడు గ్రామాల్లో పశువైద్య సిబ్బంది నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం కె.కోటపాడు పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో రికార్డులు ఆయన తనిఖీ చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి డివిజన్లలో 2 లక్షల 46 వేల పశువులకు టీకాలు వేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి లక్షా 57 వేల 844 పశువులకు టీకాలు వేసినట్లు వివరించారు. సెప్టెంబర్ 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 15 వరకూ కొనసాగుతుందని తెలిపారు.
డ్వాక్రా మహిళలకు బ్యాంక్ లింకేజీ రుణాలు..
డీఆర్డీఏ ద్వారా డ్వాక్రా మహిళలు పశువులు కొనుగోలు చేసేందుకు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించనున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకూ డ్వాక్రా మహిళల ద్వారా 980 పశువులు కొనుగోలు చేయించామన్నారు. ఈ రుణాలతో పెరటి కోళ్లు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. పాడి రైతులకు బ్యాంక్ల ద్వారా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేయిస్తున్నామని అన్నారు. తద్వారా రూ.లక్షా 60 వేల వరకూ పశుదాణా, పశు ఇన్సూరెన్స్, పశువుల షెడ్ల మరమ్మతు వంటివి చేయించుకోవచ్చన్నారు. చౌడువాడ పశువైద్యాదికారి సీహెచ్వై నాయుడు, సిబ్బంది సమీరా, ప్రవీణ్కుమార్, జగన్నాథం, తేజ, హనుమంతు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 1200 గోకులం షెడ్ల నిర్మాణం లక్ష్యం..
దేవరాపల్లి: జిల్లాలో 1200 గోకుల షెడ్ల నిర్మాణం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1062 షెడ్లకు అనుమతులు జారీ అయ్యాయని విశాఖ, అనకాపల్లి జిల్లాల పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు మండలంలోని తెనుగుపూడి, ఎ. కొత్తపల్లి పంచాయతీ శివారు సంజీవపురంలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనకాపల్లిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం 76 శాతం, విశాఖ జిల్లాలో 71 శాతం పూర్తయిందని, మిగిలిన లక్ష్యాన్ని వారంలోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి, ఎం.అలమండ, మామిడిపల్లి పశువైద్యాధికారులు జి. గాయత్రీదేవి, కె.మంజుషారాణి, జి. ప్రియాంక తదితర సిబ్బంది పాల్గొన్నారు.