
ప్రయాణికులకు యోగాంధ్ర కష్టాలు
సాక్షి, అనకాపల్లి/నర్సీపట్నం/ఎస్.రాయవరం/అనకాపల్లి : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు.. విశాఖలో శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యో గాంధ్ర కార్యక్రమం జిల్లాలో బస్సు ప్రయాణికులకు తిప్పలు తెచ్చిపెట్టింది. జనం తరలింపునకు రెండు రోజుల ముందుగానే బస్సులు తరలించారు. అనకాపల్లి డిపో నుంచి 90, నర్సీపట్నం డిపో నుంచి 70 బస్సులను మళ్లించడంతో పలు ప్రాంతాలకు సర్వీసులను గణనీయంగా కుదించారు. దీంతో బస్సులు ఎప్పుడొస్తాయో తెలియక, వచ్చిన బస్సులో చోటు లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఏజెన్సీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న అనకాపల్లి జిల్లాలో మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సే దిక్కు. నర్సీపట్నం డిపో నుంచి కేడీ పేట, కొయ్యూరు, తాండవ, సరుగుడు వంటి ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఆటోల్లో డబుల్ చార్జీలు చెల్లించుకుని వెళ్లాల్సి వచ్చింది.
దూర ప్రాంత ప్రయాణికుల ఇక్కట్లు
విశాఖపట్నంలో మద్దిలపాలెం, వాల్తేరు డిపోల నుంచి అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, అచ్యుతాపురం, పరవాడ తదితర ప్రాంతాలకు నిత్యం వందలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. విశాఖ డిపో నుంచి పలు ప్రాంతాలకు 435 ఆర్టీసీ బస్సులు తరలించడంతో సాధారణ ఆర్టీసీ ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు.
● నర్సీపట్నం నుంచి తుని, చోడవరం, విశాఖ, కొయ్యూరు, చింతపల్లి, చోడవరం, అనకాపల్లి, అడ్డురోడ్డు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సు లు లేక కాంప్లెక్స్లో నిరీక్షించారు.
● అడ్డురోడ్డు జంక్షన్లో బస్సు కోసం గంటల తరబడి ప్రయాణికులు వేచి ఉన్నారు. వచ్చిన బస్సు కిక్కిరిసినప్పటికీ మరో బస్సు వస్తుందో లేదోనని అదే బస్సు ఎక్కేందుకు పోటీ పడ్డారు.
● అనకాపల్లి నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్సుల కొరతతో ఆర్టీసీ కాంప్లెక్స్ కిక్కిరిసింది.
జనం తరలింపునకు ఆర్టీసీ బస్సుల మళ్లింపు
అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి 160 బస్సుల తరలింపు
ప్రయాణికుల ఇబ్బందులు..
ఆటో చార్జీలు రెట్టింపు

ప్రయాణికులకు యోగాంధ్ర కష్టాలు

ప్రయాణికులకు యోగాంధ్ర కష్టాలు