
25 వేల మందితో సూర్య నమస్కారాలు
● రికార్డు సృష్టించిన ఆదివాసీ విద్యార్థులు
● గిన్నిస్ రికార్డుతో అద్భుతం
● నేడు ప్రకటించనున్న ‘గిన్నిస్’ ప్రతినిధులు
ఏయూక్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయ మైదానం వేదికగా అల్లూరి సీతారామ రాజు జిల్లాకు చెందిన 106 పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కల్మషం లేని మనసులతో, చిరునవ్వులను ఆభరణంగా ధరించిన 25 వేల మందికి పైగా చిన్నారులు ఒకేసారి, లయబద్ధంగా యోగాసనాలు వేస్తూ సరికొత్త గిన్నిస్ రికార్డును సాధించారు. గతంలో 21,800 మంది విద్యార్థులతో నెలకొల్పిన రికార్డును వారే తిరగరాశారు. ఈ అద్భుత ఘట్టం ద్వారా విశాఖ నగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డు పుటల్లోకి ఎక్కాయి.
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ సూర్య నమస్కారాల ప్రదర్శన, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో జరిగింది. 108 నిమిషాల వ్యవధిలో, 108 ఆసనాలను 25 వేల మందికి పైగా చిన్నారులు ఏకకాలంలో ఒకే వేదికపై ప్రదర్శించి ఈ రికార్డును లిఖించారు. ఈ రికార్డు వివరాలను శనివారం జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అధికారికంగా ప్రకటించనున్నారు.
మంత్రుల ప్రశంసలు
కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ మాట్లాడుతూ, ఒకే వేదికపై 25 వేల మంది గిరిజన విద్యార్థులు ఇంతటి మహోన్నతమైన ప్రపంచ రికార్డును స్థాపించడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందించారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు పట్టణ ప్రాంతాల విద్యార్థుల కంటే ఎంతో దృఢంగా ఉన్నారని ప్రశంసించారు. పట్టణ యువత జంక్ ఫుడ్ తింటూ, మొబైల్స్లో మునిగిపోయి శారీరక వ్యాయామాన్ని విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరైన చిన్నారుల నిబద్ధత, పట్టుదలను అభినందించారు. ప్రపంచం మొత్తం విశాఖ నగరం వైపు చూసే విధంగా చిన్నారులు ఈ సరికొత్త రికార్డు సృష్టించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నూతన రికార్డును సృష్టించిన చిన్నారులను దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తరపున అభినందించారు. ఇక్కడి చిన్నారులను చూస్తుంటే తన కుమారుడు దేవాన్ష్ గుర్తుకు వస్తున్నాడని, ఇదే క్రమశిక్షణ తన కుమారుడికి నేర్పించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రుల కోరికలను ప్రధాని మోదీ తీరుస్తున్నారని, రాష్ట్రానికి అన్ని విధాలా సహాయం అందిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపారని, రైల్వే జోన్ ఇచ్చారని, అమరావతి అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సీఎస్ విజయానంద్, యోగా ప్రత్యేక అధికారి కృష్ణబాబు, అనకాపల్లి ఎంపీ సి.ఎం రమేష్, కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్, అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఆయుష్ శాఖ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ రికార్డును పరిశీలించే ప్రత్యేక బృందం మొత్తం ప్రక్రియను వీడియో తీసింది. హాజరైన ప్రతి విద్యార్థికి ఒక క్యూఆర్ కోడ్ను అందించి, వాటిని ప్రాంగణంలో స్కానింగ్ చేసి చిన్నారుల లెక్కింపు జరిపారు.