
బ్లాక్ మార్కెట్లో యూరియా విక్రయాలు అరికట్టాలి
మునగపాక : బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఎరువుల విక్రయాలు జరగకుండా చూడాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం వ్యవసాయ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టి ఏఈవో లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్లో రైతులకు అవసరమయ్యే ఎరువులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. పలు చోట్ల బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారన్నారు. స్థానిక పీఏసీఎస్లో యూరియా బస్తా రూ.272కు విక్రయిస్తున్నారని, బయట కొనుగోలు చేస్తే రూ.330 నుంచి 350 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేవారని గుర్తు చేశారు. వాడ్రాపల్లి సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు, ఎంపీటీసీ మద్దాల వీరునాయుడు, పార్టీ నేతలు దాసరి అప్పారావు, నరాలశెట్టి సూర్యనారాయణ,పిన్నమరాజు రవీంద్రరాజు,దొడ్డి బుజ్జి, శరగడం గోవింద,మళ్ల జోగారావు,బొడ్డేడ సోమరాజు పాల్గొన్నారు.