
కలెక్టరమ్మా.. మా మొర వినండి
తుమ్మపాల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో పలు సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ గేటు వద్ద పలు ప్రజా సంఘాల నాయకులు, గ్రామాల వారీగా ప్రజలు ఏకమై ఆందోళనలు చేపట్టారు. జిల్లా అధికారులైనా చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు పట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు. పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేస్తే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వాపోతున్నారు. పీజీఆర్ఎస్పై రోజు రోజుకూ విశ్వాసం తగ్గిపోతున్నా, గత్యంతరం లేక కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టరమ్మ స్పందించి అధికారులకు ఆదేశాలిస్తారనే గంపెడాశలతో సుదూర ప్రాంతాల నుంచి వృద్ధులు, పసిబిడ్డలతో వస్తే గేటు బయట నుంచే అడుగడుగునా ఆంక్షలతో పోలీసులు, సిబ్బంది అడ్డుకుంటున్నారు. సమస్య తీవ్రత ఎంతటిదైనా అర్జీదారుకు మాత్రమే పీజీఆర్ఎస్ వేదిక వద్దకు అనుమతించి మిగిలిన కుటుంబ సభ్యులను బయటకు నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీజీఆర్ఎస్లో 282 అర్జీలు నమోదు
పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఎస్డీసీ సుబ్బలక్ష్మి అర్జీలు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత జిల్లా అధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి పునరావృతం కాకుండా చూడాలన్నారు. మొత్తం 282 అర్జీలు నమోదు కాగా, వాటిలో రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు అధికంగా ఉన్నాయి.
86 శాతం అంగవైకల్యం ఉన్నా పింఛన్ ఇవ్వలేదు
పక్షవాతంతో కాళ్లు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నాను. 86 శాతం అంగవైకల్యంతో ఏడాది కాలానికి మాత్రమే వైద్యులు 2024లో సదరం ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారు. దాన్ని పట్టుకుని సచివాలయానికి వెళ్తే పింఛన్ రాదని అక్కడ సిబ్బంది నమోదు చేయడం లేదు. నా పరిస్థితి చూసి పింఛన్ మంజూరు చేయాలని అనకాపల్లి మండలం కశింకోటకు చెందిన కిల్లంపల్లి సత్తిబాబు తన కుటుంబ సభ్యుల సహాయంతో వీల్ చైర్పై కలెక్టరేట్కు వచ్చి మొరపెట్టుకున్నాడు.
కోళ్ల ఫారం పనులపై నిరసనలు
నివాసాలకు సమీపంలో ఏర్పాటు చేస్తున్న కోళ్ల ఫారం పనులను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మునగపాక మండలం రాజుపేట అగ్రహారం, పరవాడ మండలం భరణికం పంచాయతీ కట్టవానిపాలెం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద వేర్వేరుగా నిరసనలు చేపట్టారు. రెండు గ్రామాలకు కేవలం 250 మీటర్ల దూరంలో కోళ్ల ఫారం నిర్మించడం వల్ల ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని వాపోయారు. యాజమాన్యాన్ని ప్రశ్నించిన వారిపై రాజకీయ పలుకుబడితో పోలీసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, రెండు మండలాల ఎంపీడీవోలకు ఫిర్యాదు చేయగా, విచారించి పనులు నిలిపివేయాలని ఆదేశించారన్నారు. అయినప్పటికీ అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ చేపడుతున్న పనులను నిలిపివేయాలని కలెక్టర్ను కోరారు.
ఇంకెన్నాళ్లూ డోలీ మోత కష్టాలు
శాశ్వత రోడ్డు నిర్మించి డోలీ మోతల కష్టాలు లేకుండా చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో వి.మాడుగుల మండలం అవురువాడ పంచాయతీ కొండవీధి, పెదగోరి గెడ్డ గ్రామాల గిరిజనులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. గతంలో రోడ్డు ఏర్పాటు కోసం వాగుపై పిల్లర్లు వేసినప్పటికి మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. ఏజెన్సీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మా పిల్లల కోసమైన రోడ్డు వేసి వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు చర్యలు చేపట్టాలని విన్నవించారు.
అనుమతులు లేకున్నా,
కొండను తవ్వేస్తున్నారని ఫిర్యాదు
ఎటువంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా తవ్వేస్తున్న కొండను కాపాడాలని, భారీ మైనింగ్ వాహనాల రాకపోకలతో గ్రామంలో రోడ్లన్నీ ధ్వంసమైపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్.రాయవరం మండలం వేమగిరి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కొందరు నాయకుల అండదండలతో గ్రామంలో కొండను తవ్వేసి అక్రమ రవాణా చేయడంపై ప్రశ్నిస్తే గ్రామస్తులపై దాడులకు దిగుతున్నారని, జిల్లా అధికారులు దృష్టి సారించి మా గ్రామాన్ని కాపాడాలని కోరారు.
మా సమస్యలు అధికారులకు పట్టడం లేదు
కార్యాలయాల చుట్టూ తిప్పిస్తున్నారు
కలెక్టరేట్కు వస్తే గేటు బయటకు నెట్టేస్తున్నారు
పీజీఆర్ఎస్లో అర్జీదారుల ఆవేదన

కలెక్టరమ్మా.. మా మొర వినండి

కలెక్టరమ్మా.. మా మొర వినండి

కలెక్టరమ్మా.. మా మొర వినండి