
డిమాండ్ల సాధనకు గొంతు విప్పిన గురువులు
తుమ్మపాల: ఉద్యోగుల 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్ద బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ బోయిన చిన్నారావు మాట్లాడుతూ 11వ పీఆర్సీ గడువు ముగిసి 21 నెలలు పూర్తయినా 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం వలన రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో ఆందోళన నెలకొందని, కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు గడచినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. 2023 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం మెమో నం: 57 ద్వారా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలన్నారు. ఫ్యాప్టో సెక్రెటరీ జనరల్ యేశపోగు సుధాకర్రావు మాట్లాడుతూ సీపీఎస్, జీపీఎస్లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని, జీవో నెం.117 రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మెమో నెం.57 ఉత్తర్వుల ద్వారా 2004 ఏడాదికి ముందున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి, సీపీఎస్ ఉద్యోగులకు డీఏను 90 శాతం నగదు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యను విధ్వంసం చేసిన జీవో నెం.117ను రద్దు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానంలో సైతం స్థానిక భాషలో బోధన చేయాలని సూచించినప్పటికి తెలుగు మీడియంను పునరుద్ధరించడానికి కూటమి ప్రభుత్వం అంగీకరించకపోవడం బాధాకరమన్నారు. నిరసన ప్రదర్శన అనంతరం ఉద్యోగలు తమ డిమాండ్లపై కలెక్టర్ విజయ కృష్ణన్కు మెమొరాండం అందించారు. ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్లు ఎస్.దుర్గాప్రసాద్, ఆచంట రవి, వై.జానకీరామ్నాయుడు, కార్యవర్గ సభ్యులు వత్సవాయి శ్రీలక్ష్మి, కె.పరదేశి, మట్ట శ్రీనివాసరావు, కోశాధికారి కె.ఎస్.ఎస్.ప్రసాద్, రాష్ట్ర ఏపీటీఎఫ్ ఉపాధ్యక్షులు తమరాన త్రినాథ్, ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు బి.వెంకటపతిరాజు పాల్గొన్నారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన