పాడేరు రూరల్: ఆదివాసీల సంక్షేమం, నిరుద్యోగ యువత సమస్యలపై ఎన్నడూ స్పందించని యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘానికి, ఆదివాసీల గురించి మాట్లాడే నైతిక బాధ్యత లేదని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామరావుదొర విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూటీఎఫ్ తీరు ..దొంగలెవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.ఈ నెల 12న రంపచోడవరంలోని పీఆర్ ఫంక్షన్ హాల్లో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుందన్నారు. దీనిలో ఆదివాసీల హక్కులు, చట్టాలు, నిరుద్యోగ సమస్యలు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణపై ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. జీవో నంబర్ 3 రద్దుకు కారణమైన వారికి పరోక్షంగా సహకరించిన చరిత్ర యూటీఎఫ్కు ఉందని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేంద్రంగా గిరిజనేతర ఉపాధ్యాయ సంఘాలతో కలిసి జీటీఎఫ్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాలను ఆయన ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో ఎంతో మంది యువత చదువుకుని ఉద్యోగాలు లేక వలసలు పోతుంటే, ఆ సమస్యలపై యూటీఎఫ్ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. రాజ్యాంగ హక్కులు నిర్వీర్యమవుతున్నా పట్టించుకోని నాయకత్వం, ఇప్పుడు కొత్త నాటకాలకు తెరలేపుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బాబుజీ, జిల్లా కార్యదర్శి బూడిద మాధవరావు పాల్గొన్నారు.
ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావుదొర


