
తస్మాత్ జాగ్రత్త !
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 15 వరకు నమోదైన మలేరియా కేసులు పీహెచ్సీల వారీగా..
చింతూరు మండలం
తులసిపాక 38, మోతుగూడెం 44,
ఏడుగురాళ్లపల్లి 13
ఎటపాక మండలం
లక్ష్మీపురం 2, నెల్లిపాక 1,
గౌరిదేవిపేట 3
కూనవరం మండలం
కూటూరు 31, కూనవరం 13
వీఆర్పురం మండలం
రేఖపల్లి 14, జీడుగుప్ప 11
ఎటపాక: గ్రామాల్లో వ్యాధుల ముప్పు పొంచి ఉంది. పారిశుధ్య లోపం, వర్షాలు కురుస్తుండడంతో దోమలు, చిన్నచిన్న క్రిములు పెరిగి స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో విషజ్వరాలు విజృంభించే అవకాశం ఉంది. వ్యాధుల కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కలుషిత నీరు వల్ల కలరా, టైఫాయిడ్ తదితర వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వందలాదిమంది మలేరియా, వేలాది మంది విషజ్వరాల బారిన పడ్డారు. అయినా నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గ్రామాల్లో దోమల మందు పిచికారీ కూడా నామ మాత్రంగానే ఉంది. దోమతెరలను ఇప్పటికీ పంపిణీ చేయలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకుంటే రానున్న వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యధికారులు సూచిస్తున్నారు.
మూడు పీహెచ్సీల పరిధిలో
అధిక మలేరియా కేసులు : చింతూరు ఐటీడీఏ పరిధిలో గల పది ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 391 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 ఆస్పత్రుల పరిధిలో 1,45,516 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 35 వలస ఆదివాసీ గ్రామాలు ఉండగా, వీటిలో రహదారి, విద్యుత్, తాగునీటి సౌకర్యం లేని గ్రామాలే అధికం. వైద్యశాఖలో పెద్ద ఎత్తున యంత్రాంగం ఉన్నప్పటికీ ప్రతి ఏటా వర్షాకాలం మొదలుకొని శీతాకాలం వెళ్లేంత వరకూ సీజనల్ వ్యాధులు ఏజెన్సీని అతలాకుతలం చేస్తూనే ఉంటాయి. మలేరియా కేసుల నమోదులో చింతూరు మండలం తులసిపాక పీహెచ్సీ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా కేసులు ఎక్కువగా తులసిపాక, ఏడుగురాళ్లపల్లి, మోతుగూడెం పీహెచ్సీల పరిధిలో నమోదవుతున్నాయి. గత ఏడాది జూన్ నుంచి ఈఏడాది ఏప్రిల్ 15 వరకు చింతూరు ఐటీడీఏ పరిధిలోని చింతూరు,ఎటపాక,వీఆర్ పురం,కూనవరం మండలాల్లో 503 మలేరియా కేసులు నమోదైనట్టు డిప్యూటీ డీఎంహెచ్వో పుల్లయ్య తెలిపారు. వేసవి,వర్షాకాలంలో వలస ఆదివాసీ గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తాయి. వేల సంఖ్యలో ఈ జ్వరాల బారిన పడుతుంటారు.సకాలంలో వైద్యం అందకపోవడంతో మృత్యువాత పడిన సంఘటనలు అనేకం. చింతూరు డివిజన్లో సుమారు 35 వలస ఆదివాసీ గ్రామాలున్నాయి. పలుగ్రామాల ప్రజలు వాగులు, వంకల్లోని చెలమనీటినే తాగుతున్నారు. ఆ నీరు కలుషితం కావడంతో విషజ్వరాలు,డయేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు. వీఆర్పురం,ఎటపాక, చింతూరు మండలాల్లోని పలు ఆది వాసీ గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొంది. వ్యాధులు వస్తే సకాలంలో ప్రభుత్వఆస్పత్రులకు వచ్చి వైద్యం చేయించుకునేందుకు సరైన రహదారి సౌకర్యం కూడా లేకపోవడం గిరిజనులకు శాపంగా మారింది.
192 గ్రామాల్లో మలేరియా : చింతూరు ఐటీడీఏ పరిధిలోని 56,973 మంది జనాభా ఉన్న 192 గ్రామాలను మలేరియా తీవ్రంగా ప్రబలే గ్రామాలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లో మొదటి విడతలో దోమల మందు పిచికారీ ప్రారంభించినట్టు డిప్యూటీ డీఎంహెచ్వో తెలిపారు. అదేవిధంగా ఈ గ్రామాల్లో 78,000 దోమతెరలు పంపిణీకి అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రభుత్వం స్పందించి వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేసి విషజ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే.
పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
దోమకాటుతో విషజ్వరాలు
చింతూరు ఐటీడీఏ పరిధిలో 503 మలేరియా కేసులు
వ్యాధులకు కలుషిత నీరూ ఓ కారణం
వ్యాధుల నియంత్రణకు చర్యలు
చింతూరు డివిజన్లో మలేరియా, విషజ్వరాలు ఎక్కువగా ప్రబలుతాయి. వాటి నియంత్రణ కు ముందస్తు చర్యలు చేపడుతున్నాం. అన్ని ఆస్పత్రుల పరిధిలోని సిబ్బందిని అప్రమత్తంచేసి, గుర్తించిన గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తున్నాం. దోమతెరల పంపిణీకి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం.
– డాక్టర్ పి.పుల్లయ్య, డిప్యూటి డీఎంహెచ్వో

తస్మాత్ జాగ్రత్త !

తస్మాత్ జాగ్రత్త !

తస్మాత్ జాగ్రత్త !

తస్మాత్ జాగ్రత్త !