-
శివమెత్తిన ‘గంగ’
చిలమత్తూరు (హిందూపురం): చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీ వై.గొల్లపల్లిలోని పాడుబడ్డ బావిలో నీరు పెల్లుబుకుతోంది. స్థానికులు తెలిపిన మేరకు... రైతు కె.చిన్నప్పయ్య పొలంలో ఏర్పాటు చేసుకున్న బావిలో పదేళ్ల కిందటే నీళ్లు అడుగంటిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం యర్రకొండ అటవీ ప్రాంతంలో, చిలమత్తూరు పరిసర ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో మెరుపులు సంభవించినప్పుడు శిల బావిలో పడడంతో నీరు పైకి పెల్లుబికి ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎండిన బావిలో జలధార నిండుగా రావడంతో గ్రామస్తులు తిలకించేందుకు క్యూ కట్టారు. -
అమ్మా.. ఇంత దారుణమా..!
నిజాంసాగర్: నిండుగా నీటితో కళకళలాడాల్సిన నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక బోసిపోవడంతో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ఆశ్చర్యపోయారు. జిల్లాకు సాగు, తాగు నీరు అందించే ప్రాజెక్టు ఆగస్టులో ఇంత దారుణంగా ఉండటం ఊహించలేదన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో నిర్వహించిన మల్లన్నసాగర్ సాధన సదస్సుకు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అమ్మా ఇంతదారుణమా అన్నారు. అంతకుముందు ప్రాజెక్టు వరదగేట్ల వద్ద అడుగంటిన నీటి మట్టాని ఆయన తెలుసుకున్నారు. ప్రాజెక్టు వరద గేట్లు, ఆయకట్టు, నీటి మట్టాలను ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీచైర్మన్ దఫేదార్ రాజును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు తదితరులున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ఆలయాలు, ప్రభుత్వ స్థలాలతో పాటు ఖాళీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టపై సిద్ధి వినాయక ఆలయంలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఆలయం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హరితహారం కార్యక్రమంలో జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామాల వారిగా నాటిన మొక్కల సంరక్షణపై అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. ఆలయాల వద్ద నాటిన మొక్కలను పూజారులు సంరక్షించాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంపగోవర్దన్, ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీచైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాజేశ్వర్, డీసీసీబీ చైర్మన్ ముజుబోద్దిన్, ఆలయపూజారి సంజీవ్రావ్శర్మ నాయకులు తదితరులున్నారు. -
ముగ్గురిని రక్షించి.. తాను గల్లంతై..
ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి వంకలో పడ్డ ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తి వారిని రక్షించి తూములో పడి ప్రవాహంలో కొట్టుకుపోయిన 65 ఏళ్ల వృద్ధుడు పోలీసుల ముమ్మర గాలింపు పూతలపట్టు: ముగ్గురిని ప్రమాదం నుంచి రక్షించడం కోసం ఓ వృద్ధు డు తన ప్రాణాలను పణంగా పెట్టి న ఘటన పూతలపట్టు మండలంలోని యం.బండపల్లె వంకలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పూ తలపట్టు, పెనుమూరు పోలీసుల కథనం మేరకు.. జీడీ నెల్లూరు మండలం కొట్రకోణ గ్రామానికి చెందిన కె. కృష్ణయ్య(65) కొంత కాలంగా పెనుమూరు మండలం కలికిరి గ్రామంలోని తన కూతురు వద్ద ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు యం.బండపల్లె నుంచి తూపల్లె మీదుగా వెళ్లే వంతెనను దాటుతున్నాడు. ఈ సమయంలో ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వంతెనను దాటుతుండగా అదుపుతప్పి నీటిలో పడ్డారు. వెంటనే కృష్ణయ్య వారిని కాపాడాడు. ఇదే క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న తూములో పడ్డాడు. ఎన్టీఆర్ జలాశయానికి కేవలం 200 మీటర్లు దూరంలో ఘటనాస్థలం ఉండడం, నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వరదనీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పూతలపట్టు ఎస్ఐ మురళీమోహన్ సంఘటనా స్థలం వద్దకు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కృష్ణయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో ఎంత వెదికినా కృష్ణయ్యజాడ దొరకలేదు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. శనివారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. స్థానికులు కృష్ణయ్య సాహసాన్ని.. పరోపకార గుణాన్ని తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. -
భూగర్భ గరళం
ప్రజల ప్రాణాలతో చెలగాటం దశాబ్దాలుగా కలుషితమవుతున్న జలం పారిశ్రామిక వాడల్లో పరిస్థితి దారుణం ఎన్జీఆర్ఐ అధ్యయనంలో తేటతెల్లం డిసెంబర్లో తుది నివేదిక సిటీబ్యూరో: మహా శివుడు ఒక్కసారే గరళం తాగాడు. గ్రేటర్ ప్రజలు మాత్రం జలం పేరిట నిత్యం విషం తాగుతున్నారు. అధికారుల ఉదాసీనత సాక్షిగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మహా నగరంలో భూగర్భ జలాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) నివేదిక స్పష్టం చేసింది. పారిశ్రామిక వాడల్లో భూగర్భ జలాలు హాలాహలంగా మారాయని ఆ సంస్థ నిగ్గు తేల్చింది. దశాబ్దాలుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనిక వ్యర్థాలు భూమిలోకి ఇంకడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని తేటతెల్లం చేసింది. ఎన్జీఆర్ఐ నిపుణులతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చేయించిన అధ్యయనంలో ఈ అంశం వెలుగు చూసింది. పర్యావరణ పరిరక్షణలో బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు, పీసీబీల నిర్లక్ష్యానికి ఫలితమే విష జలమని వెల్లడవుతోంది. గత ఏడాది వర్షాకాలానికి ముందు... ఆ తరువాత సుమారు13 పారిశ్రామిక వాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భ జలాలు... చెరువుల నీటి నమూనాలను ఎన్జీఆర్ఐ సేకరించి పరీక్షించింది. వర్షాకాలానికి ముందు... ఆ తరువాత భూగర్భ జలాల్లో కరిగిన ఘన పదార్థాల శాతంలో ఎంతో వ్యత్యాసం ఉందని తేల్చింది. సాధారణంగా ఒక లీటరు నీటిలో కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్) 500 మిల్లీగ్రాములకు మించ కూడదు. కానీ అనేక పారిశ్రామిక వాడల్లో ఇందుకు మూడు నాలుగురెట్లు అధికంగా టీడీఎస్ నమోదవడం గమనార్హం. నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్ నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాల్లోని కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ఇదీ తీరు ►నాచారం- ఉప్పల్ ప్రాంతాల్లోని నీటి నమూనాలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ (కరిగిన ఘన పదార్థాలు) గరిష్టంగా 3730 ఎంజీ/లీ. నమోదు కాగా... వర్షాకాలం అనంతరం నిర్వహించిన పరీక్షల్లో టీడీఎస్ 1970 ఎంజీ/లీ నమోదైంది. ► మాల్లాపూర్ ఐడీఏ ప్రాంతంలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 5390 ఎంజీ/లీ. నమోదు కాగా... వానా కాలం తరువాతనిర్వహించిన పరీక్షల్లో 1720 ఎంజీ/లీ నమోదైంది. ► చర్లపల్లి ఐడీఏలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 6350 ఎంజీ/లీ. కాగా... ఆ తరువాత 2140 ఎంజీ/లీ నమోదైంది. ►కాటేదాన్ ఐడీఏలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 5530ఎంజీ/లీ. కాగా... అనంతర కాలంలో 1860 ఎంజీ/లీ నమోదైంది. ► బాలానగర్, సనత్ నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 7500 ఎంజీ/లీ. కాగా... అనంతరం 1530 ఎంజీ/లీ.గా తేలింది. ►ఖాజీపల్లి ఐడీఏలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 4830 ఎంజీ/లీ. నమోదు కాగా... ఆ తరువాత 1810 ఎంజీ/లీ నమోదైంది. ►బొంతపల్లి ఐడీఏ ప్రాంతాల్లో తొలుత టీడీఎస్ గరిష్టంగా 1920 ఎంజీ/లీ. కాగా..అనంతరం 1280 ఎంజీ/లీ నమోదైంది. ►పటాన్చెరువు-బొల్లారం-పాశమైలారం ప్రాంతాల్లో టీడీఎస్ గరిష్టంగా 3160 ఎంజీ/లీ. నమోదు కాగా... వర్షాకాలం అనంతరం పరీక్షల్లో 1890 ఎంజీ/లీ నమోదైంది. డిసెంబరులో పూర్తి నివేదిక ప్రస్తుతం ఎన్జీఆర్ఐ సమర్పించినది మధ్యంతర నివేదిక మాత్రమే. డిసెంబర్ వరకు అధ్యయనాన్ని కొనసాగించి తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. నగర పరిధిలో భూగర్భ జలాల స్థితిగతులు, జలప్రవాహం దిశ, కలుషితమవుతున్న తీరు, నివారణ తదితర చర్యలను తుది నివేదికలో ఆ సంస్థ పొందుపరచనుంది. అనర్థాలివే.. ►తాగడానికి, స్నానానికి ఈ నీరు పనికి రాదు. మొక్కలు, జంతువులు ఈ నీటితో చనిపోతాయి. ►ఈ నీరు తాగిన వారికి చర్మ, జీర్ణకోశ వ్యాధులతో పాటు నిమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, జలుబు వస్తాయి. ►ఈ నీటిని నిల్వ చేస్తే పాత్రలో తెల్లటి పెచ్చులు ఏర్పడతాయి. ►జీవకణాలు చనిపోతాయి. ► సల్ఫేట్లు, ఫ్లోరైడ్లు, కాల్షియం, మెగ్నీషియం వంటి మిశ్రమ పదార్థాలతో మానవ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. -
నిద్రా సమయం
షవర్ ఆన్ చేశాక నీళ్లు తల మీద పడుతుంటే దొంగ వెధవ జడ్డి వెధవ ముష్టి వెధవ అని తిట్టుకుంది. పైకి తిట్టుకుందా లోపల తిట్టుకుందా తెలియలేదు. కాని ఆ కోపం ఈ రాత్రికి దిగదు. మొన్నొక రోజు ఒక సబార్డినేట్ని పిలిచి చెడామడా తిడితే తిట్టించుకున్నామె బాగానే ఉంది. పక్కన ఉన్న నలుగురూ చేరి పైకి కంప్లయింట్ చెయ్ ఈవిణ్ణి ఇక్కణ్ణుంచి జిల్లాలకు సాగనంపుదాం అని ఎక్కించారు. జిల్లాలకు? అదీ సిటీని వదిలి. ఆ తలనొప్పి నుంచి బయట పడాల్సి వచ్చింది. టైమ్కి వచ్చారా లేదా అని మొన్న సర్ప్రైజ్ విజిట్ చేసింది. అదీ కరెక్ట్ కాదట. ఈమెకెందుకు.. పనయ్యిందా లేదా అని చెప్పమనండీ అని నలుగురైదుగురు క్యాంటీన్లో రంకెలు వేశారని తెలిసింది. ఇవాళ ఒకణ్ణి పిలిచి ఫైల్ పుటప్ చేయవయ్యా మగడా అంది. వాడి ఇంగ్లిష్ నిండా తప్పులే. రెడ్డింక్తో రౌండప్ చేసి పంపితే- అవి టైపింగ్ మిస్టేక్స్... ఫైల్ పుటప్ చేయడంలో ఇలాంటి తప్పులు మామూలే... అవి సరి చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని వాడే రివర్స్లో కామెంట్ రాసి పంపాడు. ఏమనడానికి ఏముంది? ఇంటికొచ్చి ఇదిగో ఈ పని. లేడీ ఆఫీసరంటే అన్నింటికీ అటెన్షన్. డ్రస్సు సరిగ్గా ఉన్నా అటెన్షన్. లేకపోయినా అటెన్షన్. గట్టిగా మాట్లాడితే అటెన్షన్. మాట్లాడకపోయినా అటెన్షన్. ఆఖరుకు ఆకలికి రెండు మూడు అరలున్న లంచ్బాక్స్ తెచ్చుకున్నా అటెన్షన్. మేడం... మేడం.. అందరూ గౌరవం నటించే మగాళ్లే మళ్లీ. కాని ఎంత కిందకు లాగుదామా అని చూట్టంలో ఒక్కడూ తక్కువ కాదు. మమ్మల్నీ వేధిస్తారండీ అంటాడు పక్క సెక్షన్ ఆఫీసరు. కాని అతడు సాయంత్రానికి ఫ్రెండ్స్తో చేరి బార్కు వెళ్లి హాయిగా బూతులు తిట్టుకొని రెండు గుటకలు పుచ్చుకుని డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరక్కుండా పది లోపలే ఇల్లు చేరి భోం చేసి నిద్ర పోతాడట. తనేం చేయాలి? బూతులు రావు. బార్కు వెళ్లలేదు. రాత్రి పదికి వెళ్లి భోం చేసి పడుకుందామంటే ఆ భోజనం అనే మాటను మళ్లీ తయారు చేయాల్సింది తనే. ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. లోలోపల ఏదో కోపంగా ఉంటుంది. బలవంతంగా నిశ్శబ్దంగా ఉండబుద్ధేస్తోంది. అలాగే ఉంటోంది. మొన్న పెద్దది కనిపెట్టి అంది- నువ్వు చాలా మారిపోయావ్ మమ్మీ అని. ఎనిమిది చదువుతోంది. ఎంత గమనింపో బంగారానికి. ఇంతకు మునుపైతే ఆఫీసు నుంచి రావడమే దానితో చాలా కబుర్లు చెప్పేది. కాలనీ వీధిలోకి తీసుకెళ్లి దీపాల వెలుతురులో షటిల్ ఆడేది. చిన్నాడు సైకిల్ తొక్కుతుంటే సీట్ పట్టుకుని వెనుక పరుగు తీసేది. ఇరుగు పొరుగు వాళ్లతో బోలెడు బోలెడు కబుర్లు చెప్పేది. ఇప్పుడు అవన్నీ మెల్లమెల్లగా గడ్డకట్టి పోయినట్టుగా అనిపిస్తున్నాయి. నిర్లిప్తమైన ముఖం. కోపంతో ముడతలు పడ్డ నుదురు. స్నానం ముగించి నైటీ జార్చుకుని బయటకు వచ్చింది. ఇక వంట. పిల్లలు టీవీ ముందు పుస్తకాలు వేసుకుని కూచుని ఉన్నారు. మామూలుగా అయితే వాళ్లతో కూచుని కబుర్లు చెప్పి... భర్త ఇంటికొస్తే తను పడుతున్న ఇబ్బందులేవో చెప్పుకుని... ఏం చెప్పుకున్నా ఏం ప్రయోజనం? గవర్నమెంట్ వ్యవహారాలు అర్థం కావు. పాడిందే పాడరా అన్నట్టుగా ఉద్యోగం మానేయరాదా అంటాడు. లేదంటే అవన్నీ పట్టించుకోకు అంటాడు. రెండూ సాధ్యం కాదు. చాలాసార్లు ఆ మాటే చెప్పింది. ఏం అని రెట్టిస్తాడు. వివరంగా చెప్పాలా? ఆడవాళ్లు పుట్టిల్లు అనే మాటను తీసేశారు. మంచైనా చెడ్డైనా తమ బతుకేదో తాము బతకాలని నిశ్చయించుకున్నారు. నీకు అనువుగా ఉన్నంత కాలమే నువ్వు భద్రత ఇస్తావు. తేడా వస్తే బ్యాగు సర్ది చేతికిస్తావు. అప్పుడు నా ఉద్యోగమే నాకు దిక్కు. కనుక దానిని నేను వదులుకోను. పైగా ఇది నా చదువుకీ తెలివితేటలకీ సామర్థ్యానికీ వచ్చిన ఉద్యోగం. వదిలేసి నన్ను నేను చిన్నబుచ్చుకోలేను. ఇక పట్టించుకోకపోవడం గురించి. ఒకసారి రెండుసార్లైతే పర్లేదు. అనునిత్యం ముల్లులాగా పదే పదే గుచ్చుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉండమంటావ్? అంతటితో వాదన ముగుస్తుంది. ఇది కూడా ఈ మధ్య ఆపేసింది. ఒక్క ఊరడింపు మాట కూడా లేకపోతే ఏం చేసేది? నా గోల నేను పడుతున్నాను... నన్నెవరు బుజ్జగిస్తున్నారు... నాకెవరు జోల పాడుతున్నారు... ఎంత సేపూ నీవైపు నుంచే చూస్తున్నావ్ అంటాడు. ఈ మధ్య గమనిస్తోంది. ప్రతి మనిషీ సాటి మనిషంటే మంటెత్తి పోతున్నాడు. ఇక టీమ్ లీడర్ అంటే ఊరుకుంటారా? ఏమేం పడుతున్నాడో? అవన్నీ పడి అలో లక్ష్మణా అని ఇల్లు చేరితే కాసిని పూలు పెట్టుకుని ఎదురు రాకుండా ముఖం గంటు పెట్టుకుని ఉంటే... అప్పటికీ ట్రై చేస్తోంది. కాని కుదరడం లేదే. బెల్ మోగింది. పిల్లలు నాన్నా.. నాన్నా.. అని పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ తీశారు. వాళ్లతో ఒకటి రెండు మాటలు... తనకు కళ్లతో పలకరింపు... ముఖం చూడగానే అర్థమైపోయుంటుంది... మాట్లాడకుండా షవర్కి వెళ్లిపోయాడు. లోపల ఎవర్ని తిట్టుకుంటున్నాడో. ఆ పూట మునగాకు పప్పు చేసింది. నలభైకి చేరుకున్నాక ఆడవాళ్లకు ఆకుకూరలు తప్పనిసరి అని ఎక్కడో చదివింది. కాదు భర్త చేష్టలు తప్పనిసరి అని స్నేహితురాలు జోక్ చేసింది. అయితే అలా జోక్ చేసే రోజులన్నీ ఎప్పుడో పోయాయి. పిల్లలతో తప్ప ఎదురూ బొదురూ కూచుని నవ్వుకుని ఎన్నాళ్లయ్యిందని. ఒకోరోజు ఈవైపు మూడ్ బాగోదు. లేకుంటే ఆ వైపు మూడ్ బాగోదు. భోజనాల దగ్గర కొంచెం పితలాటకం అయ్యింది. పిల్లలు మునగాకు తినం అని మారాం చేస్తే- నేను వండగలిగింది ఇంతే తింటే తినండి లేకుంటే పోండి అని పెద్దగా గద్దించింది. ఉలిక్కిపడ్డాడు. పిల్లలు కూడా. చివరికి మామిడిపండు కోసి వారికి పెరుగన్నం తినిపించింది. కాసేపు టీవీ టైం. నలుగురూ కూచున్నాక కాస్త మంచి మూడ్ సెట్ చేసే ప్రోగ్రామ్ చూద్దామంటే అన్నీ చావు వార్తలు... దుర్మార్గపు సంఘటనలు. చూసి చూసి లేచింది. పిల్లల్ని పడుకోబెడతాను అని వాళ్లను వాళ్ల గదికి బయల్దేరదీసి అరగంట తర్వాత బయటకు వచ్చింది. నేను నిద్ర పోతున్నాను- ప్రకటించింది. తల ఊపాడు. తొందరగా నిద్ర పోడు. పదకొండు దాకా టీవీ చూస్తాడు. తనకు పొద్దున్నే లేవక తప్పదు. పైగా మరుసటిరోజు ఆఫీస్ పనులను ఒకసారి మననం చేసుకోవాలి. వ్యూహాలతో సిద్ధం కావాలి. లోపలికి వెళ్లి పడుకుంది. సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ అది. అరవై డెబ్బై వేలు పెట్టి కొన్నారు. అందులో ఏం తక్కువ లేదు. ఇద్దరూ కలిసి ఇంటి నిండా ఖరీదైనవన్నీ నింపారు. బాంటియాలో ఇది డిజైనర్ బెడ్ అంటే సింగిల్ పేమెంట్తో ఇంటికి తెచ్చుకున్నారు. మెత్తగా ఉంటుంది. పడుకుంటే చక్కగా నిద్ర పడుతుంది. స్లిప్పర్స్ వదిలి ఒక పక్కకు వాలి దిండుకు చెంపను ఆనించి నిద్ర పోయింది. ఆ తర్వాత ఎప్పుడొచ్చి పడుకున్నాడో పడుకున్నాడు. ఇలా వాళ్ల కాపురం గడిచిపోతూ ఉంది. బంధువుల్లో ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ జరిగినా, కాలనీలో కారు వేసుకుని వెళుతూ వాళ్లు కనిపించినా అందరూ వాళ్లకేమీ అని అంటూ ఉంటారు. అవును. వాళ్లకేమి? మహమ్మద్ ఖదీర్బాబు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
తప్పక చదవండి
Advertisement