breaking news
victims of storm
-
సమస్యలు వింటూ.. అక్కడే పరిష్కరిస్తూ.. వరద బాధితులకు సీఎం వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తిరుపతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇటీవలి వరదల్లో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, సహాయం చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఆయన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. తొలుత తిరుపతిలో వరద నష్టానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం సరస్వతినగర్, శ్రీకృష్ణానగర్, తిరుచానూరులో కాలినడకన నేరుగా బాధితుల వద్దకు వెళ్లారు. వారి కష్టాలను స్వయంగా విన్నారు. ప్రభుత్వ సాయం అందిందా? లేదా? అని ఆరా తీశారు. నెల్లూరులో బైనాక్యులర్ ద్వారా పెన్నా ప్రవాహాన్ని, పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి అన్నా.. అక్కా.. అని ఆప్యాయంగా మాట్లాడుతూ, చిన్నారులను ఎత్తుకొని ముద్దు చేస్తూ.. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండని అడుగుతూ ముందుకు సాగారు. ప్రతి ఇంటి వద్ద ఆగి.. వారు చెప్పినవన్నీ శ్రద్ధగా విని, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వరద బాధిత కుటుంబాలకు చెందిన యువతీ యువకుల ఉపాధి అవకాశాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ హరినారాయణన్ను ఆదేశించారు. శ్రీకృష్ణానగర్ ముంపునకు గురికావటానికి గల కారణాలను స్థానికుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ రమణారెడ్డి సీఎంకు వివరించారు. అన్నా.. అమ్మ మిమ్మల్ని చూడాలంటోంది ► తిరుపతి నగరంలోని సరస్వతినగర్కు చెందిన విజయకుమారి (స్విమ్స్లో హెడ్ నర్స్) రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచం పట్టింది. ఆమె కుమార్తె వైష్ణవి.. ‘అన్నా.. అమ్మ మిమ్మల్ని చూడాలంటోంది. ఓ సారి ఇంటికి రండన్నా’ అని సీఎంను కోరింది. స్పందించిన సీఎం.. నేరుగా వారి నివాసంలోకి వెళ్లి విజయకుమారిని పరామర్శించారు. ఆ తర్వాత.. రెండేళ్లుగా మంచం పట్టిన కిడ్నీ బాధితురాలు కుసుమ గురించి కుటుంబ సభ్యులు సీఎంకు వివరించారు. ఆయన నేరుగా వారి ఇంట్లోకి వెళ్లి.. ఆమె పక్కన కూర్చొని ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. పింఛను అందుతుందా? లేదా? అని అడిగారు. పింఛన్ వస్తోందని భర్త తెలిపారు. వీరిద్దరికీ అవసరమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. ► రుయా ఆస్పత్రిలో 15 ఏళ్లుగా ల్యాబ్లో పని చేస్తున్న తనను ఉన్నట్లుండి విధుల నుంచి తొలగించారని, తనకు న్యాయం చేయాలని శివకుమార్ అనే వ్యక్తి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ‘అందరికీ సాయం అందింది. ఎప్పుడూ మీరే సీఎంగా ఉండాలి’ అని కోమల, మస్తానిలు సంతోషం వ్యక్తం చేశారు. డీకేటీ స్థలంలో ఇల్లు నిర్మించుకుని 30 ఏళ్లుగా ఉంటున్న తనకు పట్టా మంజూరు చేయాలని వెంకటప్రసాద్ సీఎంకు విన్నవించారు. ఈ నెల 21న ఆ కార్యక్రమం మొదలవుతుందని, పట్టా తప్పకుండా ఇస్తారని హామీ ఇచ్చారు. ► ఎస్.మల్లికా బేగం, ఎక్స్ సర్వీస్ మెన్ లక్ష్మీపతి, సి.రెడ్డెప్ప, సి.రాజమ్మ, జగదీశ్వరి, బేబి, మహిళా పోలీస్ నాగలక్ష్మి, రత్నమ్మ, మునెమ్మ తదితరులు సమస్యలు చెప్పుకున్నారు. చిత్తూరుకు చెందిన మస్తాన్, జమీనా దంపతులు క్యాన్సర్ చికిత్స కోసం సాయం చేయాలని కోరారు. అందరి సమస్యలు పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ► తిరుమల, తిరుపతి రుయా, స్విమ్స్, పద్మావతి అతిథి గృహంలో పని చేస్తున్న 20 మంది ఎఫ్ఎంఎస్ కార్మికులు సీఎంను కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. తిరుపతి రూరల్ మండలం శెట్టిపల్లి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తమకు న్యాయం చేయాలని బాధితులు విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. సీఎం జగన్ను ఆప్యాయంగా పలకరిస్తూ.. మీ సేవలు భేష్ తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు – పాడిపేట వద్ద స్వర్ణముఖి నదిపై వరద ఉధృతికి కొట్టుకుపోయిన వంతెనను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా రాయలచెరువు కట్ట పటిష్టతకు స్వచ్ఛందంగా సేవలు అందించిన ఆప్కాన్స్ సంస్థను అభినందిస్తూ.. ప్రాజెక్టు మేనేజర్ రంగస్వామిని సత్కరించారు. అనంతరం స్వర్ణముఖి నది ముంపునకు గురైన రామకృష్ణారెడ్డి కాలనీ వాసులు 32 మందిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసు కానిస్టేబుల్ వెంకటేశ్వర ప్రసాద్, స్థానికులు శ్రీనివాసులురెడ్డి, రెడ్డప్ప, మధులను అభినందించారు. సీఎం జగన్ ఆప్యాయంగా మాట్లాడటం, కుటుంబ సభ్యునిలా కలిసి పోయి.. ఓపికగా సమస్యలు వినడం, ఫోన్ నంబర్లు తీసుకోవడం, సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలివ్వడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు పి.వి.మిథున్ రెడ్డి, యం.గురుమూర్తి, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. తిరుపతి శ్రీకృష్ణానగర్లో మహిళను పరామర్శిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం ► శుక్రవారం మధ్యాహ్నం 1.25 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్కు సీఎం వైఎస్ జగన్.. సహాయక చర్యలను సమీక్షించడంతో పాటు, నష్టపోయిన బాధితులతో నేరుగా మాట్లాడి భరోసా కల్పించారు. వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. నెల్లూరు రూరల్ మండలం దేవరపాళెం గ్రామంలో పెన్నా ఉధృతికి కొట్టుకుపోయిన రహదారులు, పంటలు, భూముల కోతను పరిశీలించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ► జొన్నవాడ, పెనుబల్లి భగత్సింగ్నగర్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పెనుబల్లిలో సుమారు గంట సేపు స్థానికులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా రఘురామ్, విజయ్కుమార్ అనే రైతులు వారి గోడు వెళ్లబోసుకున్నారు. వేళాంగిణి, శ్రీలక్ష్మి, తదితర మహిళలు కష్టాలు చెప్పుకున్నారు. అందరి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించి.. సీఎం ముందుకు సాగారు. వరద చిత్రాలను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ నెల్లూరు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం ► నెల్లూరు నగరానికి శాశ్వత ముంపు పరిష్కారంగా పెన్నా నది కరకట్ట బండ్ నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఆ పనులకు పండుగ తర్వాత శంకుస్థాపన చేస్తానని చెప్పారు. కొట్టుకుపోయిన సోమశిల డ్యామ్ అఫ్రాన్ నిర్మాణం కోసం రూ.120 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సంగం, నెల్లూరు బ్యారేజీ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. ►రూ.2 వేలతో పాటు నిత్యావసర సరుకులు అందాయని అందరూ చెబుతున్నారని, ఇంకా వరద సాయం దక్కని వారు 5వ తేదీలోపు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులందరికీ సాయం అందుతుందని చెప్పారు. ► అర్హత ఉండీ కూడా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకుంటే ఏడాదిలో డిసెంబర్, జూన్ నెలల్లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే విచారించి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బాధితుల సమస్యలను వింటున్న సీఎం జగన్ వరద బాధితుల సహాయార్థం రూ.1.35 కోట్ల విరాళం వరద బాధితుల సహాయార్థం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు దాతలు రూ.1.35 కోట్లను ముఖ్యమంత్రికి విరాళంగా అందజేశారు. నెల్లూరు పోలీసు గ్రౌండ్లోని హెలిప్యాడ్ వద్ద బీదా మస్తాన్రావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు బీదా మస్తాన్రావు రూ.కోటి చెక్కును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. జొన్నవాడలో డీసీఎంఎస్ చైర్మన్ వీరిచలపతిరావు రూ.25 లక్షల చెక్కును, వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి రూ.10 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రైతుల్ని నిండా ముంచారు
* సర్కారు నిర్వాకం రైతులకు శాపమైంది: జగన్మోహన్రెడ్డి ధ్వజం * గ్రామాల్లోకి ఎవరూ రాలేదు.. వచ్చిన వాళ్లు నష్టాన్ని చూడట్లేదు * వరుసగా ఆరో రోజు విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటన సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు, తుపాను బాధితులు పూర్తిగా నష్టపోయి దిక్కులేని వారైపోయారు. రుణాలు కట్టవద్దని ఎన్నికల ముందు టీడీపీ చెప్పింది. అది నమ్మి రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. కానీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం రుణాలు మాఫీ చేయలేదు. దాంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. పాత రుణాలు రీషెడ్యూల్ కూడా చేయలేదు. ఫలితంగా రైతులకు పంటల బీమా కూడా వర్తించకుండా పోయింది. మరోవైపు రైతులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి పంటలు వేసుకున్నారు. తీరా తుపాను ముంచెత్తి పంటలన్నీ నాశనమయ్యాయి. రీషెడ్యూల్ చేయక పంటల బీమా లేకపోవడంతో రైతులకు బీమా కూడా రాని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం వల్ల రైతులు, తుపాను బాధితులకు దమ్మిడీ సహాయం అందకుండాపోయింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. హుదూద్ తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్మోహన్రెడ్డి వరుసగా ఆరో రోజు ఆదివారం విశాఖ జిల్లా భీమిలి, తగరపువలసలతో పాటు.. విజయనగరం జిల్లాలోనూ విసృ్తతంగా పర్యటించారు. కూలిన ఇళ్లు, దెబ్బతిన్న వరి, చెరకు, టేకు తోటలను పరిశీలించారు. రైతులు, మహిళలు, వృద్ధులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రభుత్వ సహాయం అందుతోందా లేదా అని వాకబు చేశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా మురపాక వద్ద విలేకరులతో మాట్లాడారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై విరుచుకుపడ్డారు. తుపాను బాధితులకు న్యాయం జరిగేలా చూడటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతామని.. ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. పేదలకు అండగా ఉంటామని ఆయన స్పష్టంచేశారు. తుపాను బాధితుల దుస్థితిని, సర్కారు నిర్లక్ష్య వైఖరిని జగన్ ఎండగట్టారు. పాతిక రూపాయలతో పబ్లిసిటీ స్టంట్... ‘‘తుపాను దెబ్బకు పూర్తిగా నష్టపోయిన పేదలను ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. ఒక్కసారి గ్రామాల్లోకి వచ్చి చూస్తే ప్రభుత్వం దమ్మిడీ సహాయం చేయలేదనే విషయం తెలుస్తుంది. గ్రామాల్లోకి ఎవ్వరూ రాలేదు. వచ్చిన ఒకరిద్దరు గ్రామానికి నాలుగైదు ఇళ్లు చూసి వెళ్లిపోయారు. అన్ని ఇళ్లు చూడమన్నా చూడనే లేదు. ఇలా అయితే బాధితులకు సక్రమంగా నష్టపరిహారం ఎలా వస్తుంది? కేవలం కిలో రూపాయి బియ్యం 25 కిలోలు ఇచ్చి ఏదో గొప్పగా సహాయం చేశామని ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్ చేస్తోంది. అంటే ప్రభుత్వం ఒక కుటుంబానికి విదిల్చింది కేవలం రూ. 25 మాత్రమే. ఆ మాత్రం ఇచ్చి రూ. 25 డిస్కౌంట్ ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటోంది. ఆ బియ్యం కూడా అందరికీ అందడం లేదు. అందులో పురుగులు ఉంటున్నాయి. తినలేక పేదలు అవస్థలు పడుతున్నారు. రైతులను పూర్తిగా గాలికొదిలేసింది... రైతులను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. గ్రామాల్లోకి వచ్చిన ఒకరిద్దరు అధికారులు కూడా నష్టపోయిన పంటలను చూడలేదు. పంటలు చూడండని రైతులు వేడుకున్నా వినలేదు. గాలికి, వానకు చెరకు పంట పూర్తిగా పోయింది. చెరకు నీటమునిగి అంతటా మట్టి అంటింది. మొలకలు కూడా వచ్చేస్తున్నాయి. దాంతో తూనిక కూడా సరిగా రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం 25 శాతం కూడా దిగుబడి రాని పరిస్థితి నెలకొంది. కానీ ఇంతవరకు చెరకు రైతులను ప్రభుత్వం పట్టించుకోనే లేదు. మరోవైపు సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు రైతులకు గత ఏడాది బకాయిలే ఇంతవరకు చెల్లించ లేదు. గత ఏడాది టన్నుకు రూ. 2,100 చొప్పున ఇవ్వాల్సిందే మూడు వాయిదాల్లో ఇస్తామని చెప్తున్నాయి. తీరా ఇప్పుడు ‘తుపాను వచ్చింది.. మా పంచదార నిల్వలు మునిగిపోయాయి.. కాబట్టి బకాయిలు ఇవ్వలేము’ అని చెప్పేస్తున్నాయి. చక్కెర ఫ్యాక్టరీలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోంది. సర్కారు వైఫల్యం వల్ల కృత్రిమ కొరత... తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృత్రిమ కొరత ఏర్పడింది. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఏ నిత్యావసర వస్తువూ కొనలేని పరిస్థితి ఏర్పడింది. పేదల చేతిలో డబ్బుల్లేవు. పనికి వెళ్దామంటే పని లేదు. దాంతో వంట చేసుకోవడానికి సరుకులు కూడా కొనలేని పరస్థితి ఏర్పడింది.ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. రేషన్ సరుకులు కూడా సరిగా ఇవ్వడం లేదు. గతంలో 3 కిలోల పంచదార ఇచ్చేవారు. ఇప్పుడు అరకిలోనే ఇస్తున్నారు. తుపానుకు దెబ్బతిన్న నాలుగు జిల్లాల్లో ప్రతి కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ. 5,000 ఇవ్వాలి. అలా అయితేనే పేద ప్రజలు కనీసం అత్యవస సరుకులు, వంటసామాన్లు, బట్టలు కొనుక్కుంటారు. దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుకు రూ. 50 వేలు చొప్పున సహాయం చేయాలి. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్తవి కట్టించి ఇవ్వాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు... ఇది ఎవరో ఒక్కరు వ్యక్తిగతంగా చేయలేరు. అది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం దగ్గర రూ. లక్ష కోట్ల బడ్జెట్ ఉంది. కానీ పేదలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధే లేకుండా పోయింది. కేంద్రం ఎన్ని నిధులు ఇస్తుందన్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. తుపాను సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఎన్ని నిధులు తేగలదో సీఎంను అడగాలి.’’